బ్లాక్ మనీయే బయటపడేసింది, అలా మంచిదే: అఖిలేష్ సంచలనం
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ మంగళవారం నాడు సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక మాంద్యంలో ఉన్నప్పుడు భారత దేశ ఆర్థిక వ్యవస్థకు నల్లధనం ఉపయోగపడిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
అయితే, అలా నిపుణులు అభిప్రాయపడ్డారని ఆయన చెప్పారు. నల్లధనం ఉత్పత్తి చేయరాదని, ఈ విషయంలో నేను చాలా స్పష్టంగా ఉన్నానని చెప్పారు. కానీ ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు ఆ పరిస్థితుల నుంచి మన దేశాన్ని నల్లధనం బయటపడేసిందన్నారు.
ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి సమాంతరంగా భారత దేశంలో బ్లాక్ మనీ ఉండటమే అని నిపుణులు అభిప్రాయపడ్డారన్నారు. తాను బ్లాక్ మనీని వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. తనకు అసలు ఆ డబ్బే వద్దన్నారు. బ్లాక్ మనీని బయటకు తీసుకు వచ్చేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూ కడుతున్నారన్నారు.
సాధారణ ప్రజానీకం చాలా ఇబ్బందులు పడుతోందన్నారు. నల్లధనానికి చెక్ పెట్టేందుకు ఈ నోట్ల రద్దు ఏం ప్రయోజనం కలిగించదన్నారు. అవినీతిని చెక్ చేసేందుకు మాత్రం ఇది మంచి చర్యే అన్నారు. అవినీతికి పాల్పడకూడదనే అవగాహన చాలామందికి కలుగుతుందన్నారు. నల్లధనాన్ని రూ.500, రూ.1000 నోట్లలో దాచుకున్న వారు మాత్రం ప్రస్తుతం రూ.2000 నోట్ల కోసం వేచి చూస్తున్నారన్నారు.