రక్తం, నీళ్లు కలిసి ప్రవహించకూడదు: సింధు జలాలపై మోడీ
న్యూఢిల్లీ: రక్తం, నీళ్లు కలిసి ప్రవహించకూడదని ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సింధు జలాల పైన ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.
సింధు జలాల పైన హక్కులను పూర్తిగా వినియోగించుకోవాలని, చీనాబ్ నది పైన మూడు ఆనకట్టల (పాకుల్ దుల్, సావల్ కోట్, బుర్సార్ డ్యాం) నిర్మాణ పనుల్ని సైతం వేగవంతం చేయాలని ఈ సమావేశంలో చర్చించారని తెలుస్తోంది. తుల్బుల్ నేవిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంపైనా ఈ సమావేశంలో సమీక్షించారు.
పశ్చిమ నదుల నుంచి 18వేల మెగావాట్ల విద్యుత్ వినియోగించే అంశంపై చర్చించారని సమాచారం. పశ్చిమ నదులపై హక్కులకు సంబంధించి మంత్రుల టాస్క్పోర్స్ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
కాగా, భారత్కు పాకిస్థాన్తో ఉన్న సింధు నదీ జలాల ఒప్పందంలోని సానుకూల, ప్రతికూల అంశాలపై చర్చించారు. ఈ సమీక్షలో విదేశాంగ కార్యదర్శి జైశంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ ఒప్పందంలోని వివరాలు, దానిని రద్దు చేసుకోవాలంటే వచ్చే చిక్కులు, సానుకూల, ప్రతికూల అంశాలను మోడీకి వివరించినట్లు నీటి వనరుల మంత్రిత్వ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా పశ్చిమ నదుల ద్వారా న్యాయపరంగా భారత్కు లభించిన 18 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిని పూర్తిగా వినియోగించుకోవాలని కూడా నిర్ణయించారు.
భారత్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి ముగింపు పలకనంత వరకు ఇండస్ వాటర్ కమిషన్ చర్చలు జరపకూడదని ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 1987లో చేపట్టిన తుల్ బుల్ నావిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయాలని, దానిని మరోసారి సమీక్షించాలన్నారు.