చెట్టుకు వేలాడుతూ బాలికల మృతదేహాలు: అనుమానాలెన్నో!
భోపాల్: మధ్యప్రదేశ్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఇద్దరు బాలికలు మరణించారు. చెట్టుకు ఉరి వేసుకున్న స్థితిలో వారి మృతదేహాలు కనిపించాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం పుట్టించింది. బాలికలు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చంటూ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వారి తల్లిదండ్రులు మాత్రం దీన్ని తోసిపుచ్చుతున్నారు. తమ కుమార్తెలు ఆత్మహత్య చేసుకోవడానికి బలమైన కారణాలేవీ లేవని అంటున్నారు. పోస్ట్ మార్టమ్ నివేదిక అందిన తరువాతే అసలు విషయం తెలుతుందని పోలీసులు చెబుతున్నారు.
తుపాను ముప్పు: 80 కి.మీ వేగంగా గాలులు: అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ
మృతుల పేర్లు సవిత, శివ్ దేవీ. చిత్రకూట్ జిల్లాలోని కటైయ్యా కదర్ గ్రామంలో తమ తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నారు. ఒకే ప్రాంతంలో నివసిస్తుండటంతో ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. పేద కుటుంబాలకు చెందిన వారు కావడం వల్ల మధ్యలోనే చదువును మానివేశారు. మధ్యాహ్నం బహిర్భూమికి వెళ్తున్నామంటూ చెప్పి, ఇంట్లో నుంచి బయటికి వచ్చిన వారు ఇక కనిపించలేదు. అదృశ్యం అయ్యారు. సాయంత్రం వరకూ తమ కుమార్తెలు ఇంటికి చేరుకోపకపోవడంతో భయాందోళనలకు గురైన వారి కుటుంబ సభ్యులు వెదుకులాట మొదలు పెట్టారు.
ఇంటికి సుమారు కిలోమీటర్ దూరంలో ఉన్న ఓ మామిడి తోటలో ఓ చెట్టుకు వేలాడుతూ నిర్జీవంగా కనిపించారు. ఈ దృశ్యాన్ని చూసి తల్లిదండ్రులు హతాశులయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సవిత, శివ్ దేవి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చంటూ ప్రాథమికంగా నిర్ధారించారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. కుటుంబ సభ్యులు మాత్రం పోలీసుల వాదనను తోసిపుచ్చుతున్నారు. ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితులు లేవని అంటున్నారు.