లక్షలాది మందికి లైఫ్ లైన్: బోగీబీల్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోడీ
Recommended Video

గౌహతి: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం 4.94 కిలో మీటర్ల పొడవు ఉన్న బోగీబీల్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఇది బ్రహ్మపుత్ర నది పైన ఉంది. ఇది భారత దేశంలోనే అతిపెద్ద రైలు కమ్ రోడ్ బ్రిడ్జి. ఈ రోజు (డిసెంబర్ 25) మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జయంతి. ఈ రోజును సుపరిపాలనా దినోత్సవంగా పాటిస్తారు.
మోడీ ఇదే రోజు ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. దీంతో అసోం-అరుణాచల్ ప్రదేశ్ మధ్య బ్రహ్మపుత్రపై నిర్మించిన బోగీబీల్ వంతెన అందుబాటులోకి వచ్చింది. అసోంలోని తిన్ సుకియా, అరుణాచల్ ప్రదేశ్లోని నహర్ల్ గన్ పట్టణాల మధ్య దీనిని నిర్మించారు. వాజపేయి జయంతిని పురస్కరించుకుని బోగీబీల్ వంతెనను ప్రధాని మోడీ ప్రారంభించారు.

బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. లక్షలాది మంది ప్రజలకు ఇది లైఫ్ లైన్ అన్నారు. ఇది అన్ని బ్రిడ్జిల్లా సాధారణమైనది కాదని చెప్పారు. ఇది అరుణాచల్ ప్రదేశ్, అసోం రాష్ట్రాలలోని లక్షలాది మందికి ముఖ్యమైనదని చెప్పారు.
అనంతరం, దేశంలోనే అత్యంత పొడవైన రైలు-రోడ్డు వంతెనపై మోడీ కొంత దూరం నడిచారు. దీని నిర్మాణాన్ని పరిశీలించారు. మోడీ వెంట అసోం గవర్నర్ జగదీష్ ముఖీ, ముఖ్యమంత్రి శరబానంద సోనోవాల్ ఉన్నారు. ఈ వంతెన నిర్మాణానికి 1997లో అప్పటి ప్రధాని దేవెగౌడ శంకుస్థాపన చేశారు. 2002లో వాజపేయి దీని నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ బ్రిడ్జి కింది భాగంలో రెండు లైన్ల రైలు పట్టాలు ఉంటాయి. వంతెన పైభాగంలో మూడు లైన్ల రోడ్డు ఉంది. ఈ వంతెన పొడవు 4.94 కి.మీ. దీని నిర్మాణానికి రూ.5.920 కోట్లు ఖర్చయింది. అసోంలోని తిన్ సుకియా, అరుణాచల్ ప్రదేశ్లోని నహర్ల్ గన్ పట్టణాల మధ్య ప్రయాణ దూరం 500 నుంచి 100 కి.మీ.కు తగ్గుతుంది. దాదాపు 10 గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. రక్షణ సామాగ్రి తరలించే అత్యంత భారీ వాహనాలు దీనిపై వెళ్లవచ్చు. ఈ బ్రిడ్జి పైన యుద్ధ విమానాలు కూడా దిగవచ్చు.












Click it and Unblock the Notifications