ఇంజన్ లేకుండానే 17 కి.మీ. ప్రయాణించిన 22 రైలు బోగీలు, ప్రాణ భయంతో ప్రయాణీకులు
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలో పెద్ద రైలు ప్రమాదం తృటిలో తప్పిపోయింది. ఇంజన్తో సంబంధం లేకుండా 22 బోగీలు సుమారు 17 కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి. అయితే ఈ విషయాన్ని గమనించిన రైల్వే సిబ్బంది ఇంజన్ లేకుండా వెళ్తున్న బోగీలను ఎట్టకేలకు నిలిపారు. అయితే ఈ ఘటనలో ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నారు. ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని అధికారులు ప్రకటించారు.
ఒడిశా రాష్ట్రంలోని టిట్లాగఢ్ వద్ద ఇంజిన్ మార్చే సమయంలో అప్రమత్తంగా ఉండకపోవటంతో రైలు దానంతట అదే పరుగులు తీసింది. అంతేకాదు కేసింగా వైపుకు రైలు దూసుకెళ్ళింది. ఇంజన్ లేకుండానే రైలు వెళ్తున్న విషయాన్ని బోగీల్లో ఉన్ప ప్రయాణీకులు రైల్వే సిబ్బందికి తెలిపారు. ఈ విషయం తెలియడంతో బోగీలోని ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు.
పట్టాలపై రాళ్ళను ఉంచి ఇంజన్ లేకుండా ప్రయాణీస్తున్న బోగీలను అధికారులు నిలిపివేశారు.దీంతో పట్టాలపైనే రైలు బోగీలు నిలిచిపోయాయి. ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
కేసింగా నుండి మరో ఇంజన్ను తెచ్చిన అధికారులు బోగీలను టిట్లాగడ్కు తీసుకెళ్ళారు. బ్రేకర్లు సరిగా వేయకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకొందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. విధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేసింది రైల్వే శాఖ.