ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు కాల్ ... ఆ ఫ్లైట్ లో బాంబు .. అసలేం జరిగిందంటే !!
ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఒక్కసారిగా అప్రమత్తమైన భద్రతా సంస్థలు మరియు ఢిల్లీ పోలీసు సిబ్బంది పెద్ద ఎత్తున విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించారు. ఎక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
అయితే బాంబు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి ఎవరు అన్న దానిని పరిశీలించిన పోలీసులు షాక్ అయ్యారు. విమానంలో ప్రయాణం చేస్తున్న మానసికంగా అస్థిరంగా ఉన్నట్లు చెబుతున్న ప్రయాణికుల్లో ఒకరు కాల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.ఇక ఈ ఈ సంఘటనపై మాట్లాడిన ఎయిర్ పోర్ట్ డిసిపి రాజీవ్ రంజన్ ఈరోజు ఉదయం 7.45 గంటలకు ఢిల్లీ నుండి పాట్నాకు ప్రయాణిస్తున్న విమానం లోపల బాంబు ఉందని కాల్ వచ్చిందని , మేము వెంటనే అన్ని సంబంధిత ఏజెన్సీలకు సమాచారం ఇచ్చామని వెల్లడించారు.
క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటుగా, విమానంలో ఉన్న సుమారు 52 మంది ప్రయాణికులను మరో విమానంలోకి తరలించామని చెప్పారు. పూర్తిగా తనిఖీ చేసిన తరువాత, ఇది బూటకపు కాల్ అని గుర్తించామని డిసిపి (విమానాశ్రయం) రాజీవ్ రంజన్ అన్నారు.కాల్ చేసిన 22 ఏళ్ల వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను పాఠశాల ఉపాధ్యాయుడైన తన తండ్రితో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. అయితే తన కొడుకు మానసిక స్థితి స్థిరంగా లేదని తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
తండ్రి చెప్పిన విషయం ఏమేరకు నిజమన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విమానం లోపల నుండే సదరు యువకుడు తన ఫోన్ నుండి కాల్ చేసాడు అని డిసిపి తెలిపారు. ఏది ఏమైనా ఇది ఫేక్ కాల్ అని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.