షాక్: హోం మంత్రిపై సీబీఐ దర్యాప్తు -బాంబే హైకోర్టు సంచలన ఆదేశం -అనిల్ దేశ్ముఖ్ vs పరంబీర్
మహారాష్ట్ర వేదికగా దాదాపు నెలరోజులుగా కొనసాగుతోన్న హైడ్రామా సంచలన మలుపు తిరిగింది. మహారాష్ట్ర హోం మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత అనిల్ దేశ్ ముఖ్ భారీ ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ముంబై పోలీస్ మాజీ కమిషనర్ పరంబీర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ పై బాంబే హైకోర్టు అనూహ్య ఆదేశాలిచ్చింది.
హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ఫై ముంబై మాజీ సీపీ పరమ్ బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలంటూ బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల వాహనం కేసులో అరెస్టయిన సచిన్ వాజే(మాజీ పోలీస్) ద్వారా దేశ్ముఖ్ తీవ్రస్థాయి అక్రమాలకు పాల్పడ్డారని, ప్రతినెలా రూ.100కోట్ల వసూళ్లను లక్ష్యంగా పెట్టారంటూ పరమ్ బీర్ ఆరోపణలు చేయడం తెలిసిందే.

మంత్రి దేశ్ ముఖ్ అవినీతిపై తన వద్ద కొన్ని ఆధారాలున్నాయని, దీనిపై విచారణకు ఆదేశించాలంటూ పరంబీర్ తొలుత సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ముందు హైకోర్టుకు వెళ్లాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. దీంతో వ్యవహారం బాంబే హైకోర్టుకు చేరింది. మాజీ సీపీ పరంబీర్ తోపాటు పాటు న్యాయవాది జయశ్రీ పాటిల్, మరో టీచర్ కూడా హోం మంత్రిపై పిటిషన్లు వేయగా, వాటిని బాంబే హైకోర్టు సోమవారం విచారించింది..
''హోంమంత్రిపై ఇలాంటి ఆరోపణలు రావడం అసాధారణం.. అనూహ్యం. ఈ కేసులో స్వతంత్ర విచారణ అవసరం. దేశ్ముఖ్పై వచ్చిన ఆరోపణలపై సీబీఐ 15 రోజుల్లో ప్రాథమిక విచారణ పూర్తి చేయాలి. దర్యాప్తులో ఆధారాలు లభిస్తే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాలి'' అని బాంబే హైకోర్టు సోమవారం నాడు ఉత్తర్వులిచ్చింది. సీబీఐ ప్రాథమిక దర్యాప్తు తర్వాత ఈ వ్యవహారంపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని జడ్జిలు స్పష్టం చేశారు. మరోవైపు..
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల వాహనం కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇటీవల దక్షిణ ముంబయిలోని ఓ క్లబ్లో జరిపిన సోదాల్లో ఎన్ఐఏ కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఓ పత్రాల్లో ఆ క్లబ్ నెలవారీగా ప్రభుత్వ అధికారులకు ఇచ్చిన సొమ్ము వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు, ఇతర అధికారులకు ఇచ్చిన లంచాలు, వారి పేర్లతో సహా ఉన్నట్లు సమాచారం. వీటిని దర్యాప్తు సంస్థ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈ కేసులో వాజే కస్టడీని ఏప్రిల్ 7 వరకు పొడగించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications