బాంబే హైకోర్టు మూసివేత, శివసేన ఫౌండర్స్ డే రద్దు
ముంబై: దేశ వాణిజ్య పట్టణమైన ముంబైని భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ముంబై మహానగరమంతా జలమయమైంది. ఇప్పటికే నగరంలోని రైల్వేట్రాక్లు, రోడ్లు పూర్తిగా వర్షంతో నిండిపోయాయి. నగరంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించింది.
ప్రతిష్టాత్మక బాంబే హైకోర్టులోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో శుక్రవారం హైకోర్టుకు సెలవు దినంగా ప్రకటించారు. లోకల్ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. జన జీవనం స్తంభించింది. స్కూళ్లను మూసివేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయొద్దని అధికారులు హెచ్చరించారు.
ఈ భారీ వర్షం మరో మూడు రోజులపాటు కొనసాగే అవకాశం ఉందని స్కైమెట్ అనే ప్రైవేటు వాతావరణ సమాచార సంస్థ హెచ్చరిస్తోంది. ముంబై నగరంతో పాటు కొంకణ్ తీర ప్రాంతంలో కూడా వర్షాలు పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది.
ఇక గడిచిన 24గంటల్లో ముంబై నగరంలో 283 మి. మీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతో జూన్ నెల వర్షపాతం 537 మి. మీటర్లకు చేరింది. అంటే నెలసరి సగటు 523 కన్నా ఇది ఎక్కువ. వచ్చే 72గంటల్లో గోవాలోనూ భారీ వర్ష సూచన ఉందని అధికారులు చెప్పారు.
శివసేన ఫౌండర్స్ డే రద్దు
శుక్రవారం సాయంత్రం ముంబైలో జరగాల్సిన శివసేన ఫౌండర్స్ డే రద్దైంది. ముంబైలో గత రాత్రి నుంచి భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్థం అవడంతో శివసేన వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.