కరోనా వైరస్ : భారత్లో 10 ఏళ్ల బాలుడి ధీనగాథ ఇది.. ఆసుపత్రుల చుట్టూ తిరిగి తిరిగి..
రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారత్ను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో దేశంలో ఉన్న వైద్యు సదుపాయాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. 130 కోట్ల పైచిలుకు జనాభా ఉన్న దేశంలో ఎక్కువ మంది వైరస్ బారినపడితే చికిత్స అందించడం సాధ్యమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైరస్ విజృంభించడం సంగతి పక్కనపెడితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లోనే సకాలంలో వైద్య చికిత్స అందక కొంతమంది ఆవేదన చెందుతున్నారు. శ్రీనగర్లో కరోనా సోకిన 10 ఏళ్ల ఓ బాలుడు కరోనా చికిత్స కోసం ఆసుపత్రుల చుట్టూ తిరిగి తిరిగి చివరకు ఇంటికే చేరిన వైనం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అప్పుడు గానీ అధికారుల్లో చలనం రాలేదు.

కరోనా బారిన శ్రీనగర్ బాలుడు..
మార్చి 18-22 తేదీల్లో శ్రీనగర్లోని ఈద్ఘాలో ఓ బాలుడు(10) ఓ మత ప్రబోధకుడిని కలిశాడు. ఆ సమయంలో షేక్ హ్యాండ్ ఇచ్చిన కారణంగా.. అతని నుంచి బాలుడికి కరోనా వైరస్ సోకింది. మొదట సదరు మతపెద్దకు పాజిటివ్గా తేలగా.. ఆ తర్వాత బాలుడిలోనూ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో మార్చి 28న ఎస్ఎంహెచ్ఎస్ ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడి వైద్య సిబ్బందిని బాలుడి చేర్చుకోవడానికి తిరస్కరించారు. బాలుడికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని.. చెస్ట్ డిసీజ్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో అంబులెన్స్లో చెస్ట్ ఆసుపత్రికి తరలించారు.

చేర్చుకోని వైద్యులు.. పడకలు ఖాళీ లేవని..
కానీ చెస్ట్ ఆసుపత్రి వైద్యులు కూడా బాలుడిని చేర్చుకోలేదు. అక్కడ పడకలు ఖాళీ లేని కారణంగా.. రైనవరిలోని జవహర్లాల్ నెహ్రూ మెమొరియల్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. పేషెంట్కు 48045 అనే టికెట్ నెంబర్ కూడా ఇష్యూ చేశారు. అయితే అక్కడినుంచి జేఎల్ఎన్ఎం ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్ కూడా ఇవ్వలేదు. సొంతంగా వెళ్లాల్సిందేనని చెప్పడంతో.. ఎలాగోలా అక్కడికి చేరుకున్నారు. కానీ అక్కడ కూడా నిరాశే ఎదురైంది. కేవలం పోలీసులు తీసుకొచ్చిన పేషెంట్స్ను మాత్రమే చేర్చుకుంటున్నామని చెప్పారు. దీంతో చేసేదిలేక ఆ తండ్రి తన కొడుకును ఎత్తుకుని తిరిగి ఎస్ఎంహెచ్ఎస్ ఆసుపత్రికి వెళ్లాడు.

చేసేది లేక ఇంటికే...
ఎస్ఎంహెచ్ఎస్ ఆసుపత్రిలో కన్నీళ్లు పెట్టుకున్న ఆ తండ్రి తన కుమారుడికి చికిత్స చేయాలని వేడుకున్నాడు. అయితే అక్కడినుంచి బాలుడిని SKIMS ఆసుపత్రికి తరలించాల్సిందిగా సూచించారు. 1268555 అనే టికెట్ నెంబర్ కూడా ఇష్యూ చేశారు. తీరా అక్కడికెళ్లాక.. బాలుడిని పరీక్షించిన వైద్యులు... తిరిగి ఇంటికే పంపించారు. ఇంట్లోనే క్వారెంటైన్లో ఉండమని చెప్పి.. తరుచూ చేతులు వాష్ చేసుకోమని చెప్పి పంపించారు. దీంతో బరువెక్కిన హృదయంతో ఆ తండ్రి తన కొడుకును భుజాలపై మోసుకుంటూ తిరిగి ఇంటికి చేరుకున్నాడు.

రెండు రోజులు గడిచాక..
బాలుడి అవస్థ గురించి సోషల్ మీడియాలో ఎవరో పోస్టు చేయగా.. అది కాస్త వైరల్గా మారింది. రెండు రోజుల తర్వాత మార్చి 30న ఆరోగ్యశాఖ అధికారులు బాలుడి ఇంటికెళ్లి.. అతన్ని SKIMS ఆసుపత్రికి తరలించి క్వారెంటైన్లో ఉంచారు. కానీ అప్పటికే బాలుడు ఇంట్లో రెండు రోజుల పాటు ఉన్నాడు. అయితే అతనికి ఇంట్లోనే ప్రత్యేక గది కేటాయించి క్వారెంటైన్ చేశామని తండ్రి చెప్పాడు. మార్చి 31న వైద్య పరీక్షలలో అతనికి పాజిటివ్ తేలింది. దీంతో బాలుడి కుటుంబాన్ని కూడా ఆసుపత్రికి తరలించి క్వారెంటైన్ చేశారు. వారి శాంపిల్స్ను ల్యాబ్కు పంపించారు. అంతా పైవాడి దయ అంటూ ప్రస్తుతం ఆ బాలుడి తండ్రి నిట్టూరుస్తున్నాడు. మరోవైపు బాలుడిని ముందే ఎందుకు ఆసుపత్రిలో చేర్చుకోలేదన్న ప్రశ్నలకు ఆసుపత్రి వైద్యులు సమాధానం దాటవేస్తున్నారు.












Click it and Unblock the Notifications