బ్రహ్మకుమారీస్ చీఫ్, రాజయోగిని హృదయ మోహిని మృతి -సద్గుణాలకు సజీవ ఉదాహరణన్న చంద్రబాబు
ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారీస్ అధ్యక్షురాలు,ప్రజాపతి బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం చీఫ్, రాజయోగిని దీదీగా పేరుపొందిన హృదయ మోహిని (93) ఇక లేరు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె... ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు.
గతేడాది మార్చిలో రాజయోగిని దాదీ జానకి కన్నుమూయడంతో బ్రహ్మకుమారీస్ అధ్యక్షురాలిగా హృదయ మోహిని బాధ్యతలను స్వీకరించడం తెలిసిందే. ఆ పదవి కంటే ముందు ఆమె, బ్రహ్మకుమారీస్ ఢిల్లీ జోనల్ అధిపతిగా పని చేశారు. ఇండియాతోపాటు విదేశాల్లోనూ ఆధ్యాత్మికత, సాత్విక జీవనశైలి, రాజయోగ జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి ఆమె విశేష కృషి చేశారు.

బ్రహ్మకుమారీస్ అధ్యక్షురాలు రాజయోగిని హృదయ మోహిని మృతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, టీడీపీ చీఫ్ చంద్రబాబు సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు. 'దాదీ గుల్జార్' అని జనమంతా ప్రేమగా పిలుచుకునే రాజయోగిని హృదయ మోహిని మరణం మనస్తాపం కలిగించిందని, సామాజిక సేవ, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం, రాజ యోగా కోసం ఆమె తన జీవితాన్ని అంకితం చేశారని ఉపరాష్ట్రపతి వెంకయ్య పేర్కొన్నారు.
రాజయోగిని దాది గుల్జార్ జీవితాంతం మానవ సేవకు పాటుపడ్డారని, ప్రజలను ఆథ్యాత్మిక మార్గంవైపునకు నడిపించారని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. బ్రహ్మకుమారీస్ అధిపతి రాజయోగిని దాదిజీ జీవించినంత కాలం సద్గుణాలకు సజీవ ఉదాహరణగా ఉన్నారని, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చారని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ఈ విచారక సమయంలో బ్రహ్మకుమారీస్ కుటుంబానికి బలం చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు టీడీపీ చీఫ్ ఓ ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications