విశ్వాసం: పులితో పోరాడి యజమానిని కాపాడిన కుక్క
లక్నో: విశ్వాసానికి మారుపేరు తానేనని నిరూపించుకుందో శునకం(కుక్క). వీధుల వెంట తిరుగుతున్న తనను అల్లారుముద్దుగా చూసుకున్న యజమానిని కాపాడుకునేందుకు ఆ శునకం తన ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. యజమానిని కాపాడేందుకు ఏకంగా పులితో పోరాటం చేసింది. చివరకు యజమాని ప్రాణాలను కాపాడి.. తన ప్రాణాలను వదిలేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుందీ ఘటన.
వివరాల్లోకి వెళ్తే.. దుద్వా జాతీయ పార్క్ సమీపంలోని బార్బత్ గ్రామంలో తన ఇంటి ముందట గురుదేవ్ సింగ్ అనే రైతు, అతడు పెంచుకున్న నాలుగేళ్ల జాకీ(కుక్క) కలిసి నిద్రిస్తున్నారు. ఈ సమయంలో అటుగా ఓ పులి వచ్చింది. పులి రావడాన్ని పసిగట్టిన కుక్క అప్రమత్తమై గురుదేవ్ సింగ్ను నిద్ర నుంచి లేపింది.
పులి వీరి దగ్గరికి వచ్చే సరికి జాకీ పులిపై దాడి చేసింది. పులి, జాకీ మధ్య తీవ్ర పోరాటం చేసింది. గురుదేవ్ కూడా అక్కడున్న కట్టె తీసుకుని పులిపై దాడి చేశాడు. దాడి చేసినప్పటికీ పులి తిరగబడటంతో గురుదేవ్ కూడా స్వల్పంగా గాయపడ్డాడు. పులి దాడి తీవ్రం కావడంతో గురుదేవ్ తప్పించుకున్నాడు.
అప్పటికే తీవ్రంగా గాయపడిన జాకీని పులి తన వెంట ఈడ్చుకెళ్లింది. కొంచెం దూరంలో జాకీని వదిలిపెట్టి పులి అడవిలోకి పారిపోయింది. గురుదేవ్ను కాపాడి జాకీ ప్రాణాలు కోల్పోవడంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు.
తీవ్ర విషాదంలో జాకీకి అంత్యక్రియలు నిర్వహించారు. జాకీని తమ పిల్లలాగే కంటికి రెప్పలా చూసుకున్నామని గురుదేవ్ కన్నీరుమున్నీరుగా విలపించాడు. తనను కాపాడటం కోసం తన జాకీ ప్రాణ త్యాగం చేసిందని చెప్పాడు.