బ్రేకింగ్ : దారుణ స్థితిలో భారత్ ; 3.50 లక్షలకు చేరువగా కొత్త కరోనా కేసులు , 2,624 మరణాలతో రికార్డ్ బ్రేక్ !
భారతదేశాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది .ఊహించని విధంగా ఇండియాలో పెరిగిన కేసులు, ప్రపంచ దేశాలను సైతం భారత్ వెళ్లొద్దని తమ దేశ పౌరులను హెచ్చరించేలా చేస్తున్నాయి . వరుసగా మూడవ రోజు, భారతదేశం శనివారం 3 లక్షలకు పైగా తాజా కేసులను నమోదు చేసింది. ప్రపంచంలోనే అత్యధిక రోజువారీ సంఖ్యను నమోదు చేసే ధోరణిని భారత్ గత మూడు రోజులుగా కొనసాగిస్తోంది.
కరోనా సెకండ్ వేవ్ : మేలో ఉగ్రరూపం దాల్చనున్న కరోనా , హెల్త్ ఎమర్జెన్సీలో దేశం !!
తాజాగా 3,46,786 మందికి కరోనా పాజిటివ్ .. కోటి 66 లక్షలు దాటిన మొత్తం కేసులు
గత 24 గంటల్లో 17,53,569 పరీక్షల్లో భారత్ లో 3,46,786 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. భారతదేశం యొక్క మొత్తం కరోనా కేసుల సంఖ్య శనివారం 1,66,10,481 కు చేరుకుంది. ఒకే రోజు మరణాల సంఖ్య కూడా 2,624 మంది మరణించడంతో రికార్డు సృష్టించింది. దీంతో భారతదేశ మరణాల సంఖ్య దాదాపు 1.9 లక్షలకు చేరుకుంది. ఇప్పటి వరకు మొత్తం నమోదైన మరణాల సంఖ్య 1,89,544 గా ఉంది. దారుణ స్థితికి భారత్ చేరుకుంది .
తాజాగా 25 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు , మొత్తం కేసులలో 15 శాతం
గత 24 గంటల్లో సుమారు 2.19 లక్షల మంది ప్రజలు కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. దీంతో దేశంలో రికవరీ రేటు 83.92 శాతానికి చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులెటిన్ ద్వారా తెలుస్తుంది . దేశంలో క్రియాశీల కోవిడ్ -19 కేసుల సంఖ్య 25 లక్షలకు పైగా ఉంది. ఇది మొత్తం కేసులలో 15 శాతంగా ఉంది.
ఫిబ్రవరి నుండి భారతదేశంలో కేసుల సంఖ్య పెరగడం ప్రారంభమైంది. ఆ సమయంలో పెరుగుదల మహారాష్ట్రతో సహా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాగా, మార్చి మరియు ఏప్రిల్ నెలల్లో మహమ్మారి యొక్క సెకండ్ వేవ్ చాలా రాష్ట్రాలలో విజృంభిస్తోంది.
పెరుగుతున్న రోజువారీ కేసుల సంఖ్య .. పీక్స్ కు చేరుతున్న కరోనాపై మోడీ మీటింగ్స్
గత కొద్ది రోజులుగా, కోవిడ్ -19 పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఎందుకంటే రోజువారీ కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో పాటు ఆసుపత్రి పడకలు, ఆక్సిజన్, డ్రగ్స్ మొదలైన వాటి కొరత దేశానికి ఇబ్బందికరంగా మారింది.
విపరీతంగా కేసులు నమోదవుతున్న కోవిడ్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అన్ని రాష్ట్రాలకు కేంద్రం పూర్తి సహకారం ఇస్తుందని హామీ ఇచ్చారు . కరోనా బాధితులకు వినియోగించే మందుల, ఇంజెక్షన్ల బ్లాక్ మార్కెటింగ్ పై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ .. మే 1 నుండి మూడో దశ టీకాలు
దేశంలోని ప్రముఖ ఆక్సిజన్ తయారీదారులతో ప్రత్యేక సమావేశంలో ప్రధాని, ప్రభుత్వం మరియు ఆక్సిజన్ ఉత్పత్తిదారుల మధ్య మంచి సమన్వయం అవసరమని స్పష్టం చేశారు. ఇదే సమయంలో భారతదేశం యొక్క టీకా డ్రైవ్ యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోంది.
మే 1 నుండి మూడవ దశ టీకాలు వేయడానికి దేశం సిద్ధమవుతున్న సమయంలో దేశం యొక్క కోవిడ్ 19 పరిస్థితి మరింత దిగజారింది. ప్రస్తుతం కరోనా వివిధ రాష్ట్రాల్లో కల్లోలం సృష్టిస్తోంది. మరణ మృదంగం మోగిస్తోంది . ఈ ప్రభావం మే నెలలో కూడా కొనసాగుతుందని, మేలో కూడా ఉగ్రరూపం దాలుస్తుందని అందరూ అలెర్ట్ గా ఉండాలని పదేపదే హెచ్చరిస్తున్నారు.