తర్వాతే అప్పగింతలు: పెళ్లి దుస్తుల్లోనే పరీక్ష రాసిన నవవధువు
జైపూర్: ఆ అమ్మాయికి కొద్ది గంటల ముందే వివాహమైంది. అయితే ఆమెకు అదే సమయానికి డిగ్రీ పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో ఆమె తన భర్తకు విషయం చెప్పి, పరీక్ష హాలుకు పెళ్లి దుస్తుల్లోనే బయల్దేరింది. తన పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఘటనతో ఆమె విద్యకున్న ప్రాధాన్యతను తెలియజేసి పలువురికి ఆదర్శంగా నిలిచినట్లైంది.
ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని బాలేశ్వర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాలేశ్వర్ ప్రాంతానికి చెందిన సంతోష్ ప్రజాపత్కు సోమవారం రాత్రి వివాహమైంది.

అప్పగింతల కార్యక్రమం మంగళవారం జరగాల్సి ఉంది. అయితే, మంగళవారమే ఆమెకు బిఏ మొదటి సంవత్సరం పరీక్ష కూడా ఉంది. తన పరీక్ష తర్వాతే అప్పగింతల కార్యక్రమం పెట్టుకోవాలని కుటుంబసభ్యులను, భర్తను కోరింది ప్రజాపత్.
ఆమె పట్టుదలకు లొంగిపోయిన కుటుంబసభ్యులు, బంధువులు ఆమెను పరీక్ష రాసేందుకు అంగీకరిచారు. దీంతో ఆమె పెళ్లి దుస్తుల్లోనే వెళ్లి పరీక్ష రాసింది. పరీక్ష అనంతరం ఆమె మాట్లాడుతూ.. తాను ఇప్పుడు పరీక్ష రాయకపోతే మొత్తం విద్యా సంవత్సరమే వృథా అవుతుందని.. అందుకే తాను అందర్నీ ఒప్పించి పరీక్ష రాసినట్లు తెలిపింది.












Click it and Unblock the Notifications