అమ్మాయిపై అన్నదమ్ముళ్ల రేప్: ఇంకా పరారీలోనే..
సేలం/ గుర్గావ్: ఇద్దరు అన్నదమ్ముళ్లు 13 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలతో వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు బుధవారం వెల్లడించారు. అత్యాచారానికి పాల్పడిన బాలుర్లలో ఒకతను పాలిటెక్నిక్ చదువుతుండగా, మరొకతను ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు.
అమ్మాయి తల్లిదండ్రులు కూలీలు. వారు ఇంట్లో లేని సమయంలో అమ్మాయిపై వాళ్లు అత్యాచారం చేశారు. నిందితుల్లో ఒకతని వయస్సు 18 ఏళ్లు కాగా, మరో బాలుడి వయస్సు 14 ఏళ్లు. వారిని మంగళవారంనాడు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలావుంటే, ఆదివారంనాడు 17 ఏళ్ల బాలికపై గుర్గావ్లోని ఫ్లాట్లో అత్యాచారానికి పాల్పడిన నలుగురిలో ఇద్దరిని పోలీసులు మంగళవారంనాడు కోర్టులో ప్రవేశపెట్టారు. వారిని ఓ రోజు కోసం కోర్టు పోలీసు కస్టడీకి అప్పగించింది. మూడో నిందితుడు మైనర్ కావడంతో అతన్ని జువెనైల్ కోర్టులో ప్రవేశపెట్టారు. అతన్ని శరణాలయంలోకి తరలించారు. నాలుగో నిందితుడి ఇంకా పరారీలోనే ఉన్నాడు.
సంఘటన పూర్వపరాలు
నలుగురు యువకులు తనను అపహరించి, తనపై సామూహిక అత్యాచారం చేసినట్లు ఓ 17 ఏళ్ల బాలిక ఆరోపించింది. అమ్మాయిని గుర్గావ్లోని ఆమె ఇంటి నుంచి ఆదివారం రాత్రి కిడ్నాప్ చేశారు. ఓ ఫ్లాట్లోకి తీసుకుని వెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ నలుగురిలో ఒకతను అమ్మాయికి తెలిసినవాడు. ఆదివారం రాత్రి దారుణానికి ఒడిగట్టిన నిందితులు సోమవారం ఉదయం ఆమెను ఇంటి వద్ద వదిలేశారు. పోలీసులకు చెప్తే తీవ్రమైన పరిణామాలుంటాయని కూడా వారు బెదిరించారు.
అమ్మాయి చెప్పిన వివరాల ప్రకారం - ఆమె ఉదయం 8 గంటలకు మహిళా హెల్ప్లైన్కు ఫోన్ చేసింది. దాంతో పోలీసులు వచ్చి ఆమె ఫిర్యాదును నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత పరీక్షల నిమిత్తం సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఆమెపై అత్యాచారం జరిగినట్లు పరీక్షల్లో తేలింది. సాయంత్రం పూట ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకతను ఓపెన్ స్కూల్లో 12వ తరగతి చదువుతున్నాడు. అతనితో అమ్మాయికి పరిచయం ఉంది. వారిద్దరు తరుచుగా ఫోన్లో మాట్లాడుకునేవారని కాల్ రికార్డులను బట్టి తెలిసిందని పోలీసులు చెప్పారు.
పదో తరగతి చదువుతున్న అమ్మాయి, ఆ రోజు అర్థ రాత్రి తన ఇంటి బయట నిలబడి వైఫై కనెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆ సమయంలో మిత్రుడు కారులో మరో ముగ్గురితో వస్తూ కనిపించాడు. వారితో మాట్లాడడానికి బాధితురాలు కారు వద్దకు వెళ్లింది. వాళ్లు అమ్మాయిని తమ కారులోకి లాక్కున్నారు. కారులో తీసుకుని వెళ్లి ఫ్లాట్లో నలుగురు కూడా ఆమెపై అత్యాచారం చేశారు.