బీఎస్-4 వాహనాల అమ్మకాల్లో మోసం - సుప్రీం సంచలనం - రిజిస్ట్రేషన్లపై నిషేధం పొడగింపు..
భారత్ స్టేజ్-4 (బీఎస్-4) ఉద్గారాల ప్రమాణాలు గల వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆటోమొబైల్ డీలర్లకు కలిసొచ్చేలా, రిజిస్ట్రేషన్లకు 10 రోజుల సడలింపులు కల్పిస్తూ ఈనెల 8 జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. దీంతో బీఎస్-4 వాహనాల నమోదు ప్రక్రియపై మళ్లీ నిషేధం పొడిగించినట్లయింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయన్న కోర్టు.. తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది. విచారణ సందర్భంగా డీలర్లను ఉద్దేశించి కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
బీఎస్-4 వాహనాలకు సంబంధించి కేసుల్ని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారిస్తున్నది. ఈ ఏడాది మార్చి 31 తర్వాత విక్రయించిన బీఎస్-4 వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ గతంలో ఉత్తర్వులిచ్చిన ధర్మాసనం.. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఢిల్లీ మినహా దేశవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో 10 రోజులపాటు బీఎస్-4 అమ్మకాలకు అనుమతించింది. అయితే ఈ ఆదేశాలను ఆటోమొబైల్ డీలర్లు ఉల్లంఘించారని ధర్మాసనం గుర్తించింది.
సోము వీర్రాజు vs సుజనా చౌదరి - రాజధానిపై సంచలన వ్యాఖ్యలు - బీజేపీ చీఫ్తో ఎంపీ విభేదం
1.05లక్షల బీఎస్-4 వాహనాల అమ్మకం లేదా రిజిష్ట్రేషన్లకు తాను సడలింపులు కల్పిస్తే.. ఆటోమొబైల్ అసోసియేషన్లు మాత్రం ఏకంగా 2.55 లక్షల వాహనాలను విక్రయించినట్లు డేటాలో గుర్తించామని ధర్మాసనం పేర్కొంది. ''లాక్ డౌన్ సమయంలో అధిక అమ్మకాలు ఎలా జరిగాయి? ఇందులో ఏదో మోసం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ గుట్టును రాబడతాం. అన్ని వ్యవహారాలపైనా విచారణ చేస్తాం. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా రిజిస్ట్రేషన్లు చేయడానికి వీల్లేదు'' అని జడ్జిలు వ్యాఖ్యానించారు.
బీఎస్-4 వాహనాల అమ్మకం, రిజిస్ట్రేషన్లపై తొలుత ఉత్తర్వులిచ్చిన తేదీ(ఈఏడాది మార్చి 27) నుంచి మొత్తం ఎన్ని వాహనాలు అమ్మారో, ఎన్నింటికి రిజిస్ట్రేషన్ చేశారనే వివరాలను సమగ్రంగా అందించాలంటూ ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) ను సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.