వ్యవసాయ బిల్లులపై తేల్చేసిన రాష్ట్రపతి: అనుమానాలను తొలగించేలా: త్రివర్ణ పతకానికి అవమానం
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొద్దిసేపటి కిందటే ఆరంభం అయ్యాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. భారతరత్న,మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సహా కరోనా బారిన పడి మరణించిన ఉభయ సభ సభ్యులకు ఆయన నివాళి అర్పించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడానికి అనేక చర్యలను తీసుకున్నామని వివరించారు. లాక్డౌన్ సమయంలో నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేశామని, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ విధానాన్ని ప్రవేశపెట్టామని రాష్ట్రపతి అన్నారు.
నిర్ధారణ పరీక్షల్లో వేగం పెరిగడానికి ఆత్మనిర్భర్ భారత్ చేయూత
వలస కార్మికులకు ఉన్న చోటే ఉపాధిని కల్పించడానికి చర్యలు తీసుకున్నామని వివరించారు. జన్ధన్ ఖాతాల్లో నగదు బదిలీ, 14 కోట్లకు పైగా సిలిండర్లను తన ప్రభుత్వం ఉచితంగా అందజేశామని చెప్పారు. ఆత్మనిర్భర్లో భాగంగా.. పీపీఈ కిట్లను సొంతంగా తయారు చేసుకునే స్థాయికి ఎదిగామని చెప్పారు. వందలాది కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను అతి తక్కువ కాలంలో ఏర్పాటు చేసుకోగలిగామని తెలిపారు. ఫలితంగా- కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో వేగం పెరిగిందని అన్నారు.
మూడు వ్యవసాయ బిల్లులపై
అత్యంత వివాదాస్పదమైన, దేశ రాజధానిలో హింసాత్మక వాతావరణానికి కారణమైన మూడు వ్యవసాయ బిల్లుల గురించి రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. వ్యవసాయోత్పత్తులను విక్రయించుకోవడానికి ఇదివరకు ఉన్న సౌకర్యాలను మరింత మెరుగుపర్చామని అన్నారు. రైతులకు మరిన్ని అధికారాలు సంక్రమించేలా చేశామని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మరింత వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేయడానికే మూడు వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చామని అన్నారు. వ్యవసాయ రంగాన్ని లాభదాయకంగా మార్చడానికి కట్టుబడి ఉన్నామని అన్నారు.
రూ. లక్ష కోట్లతో
లక్ష కోట్ల రూపాయలతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని కల్పించామని తెలిపారు. పశు సంవర్ధకం, మత్స్య సంపదను అభివృద్ధి చేయడానికి వచ్చే అయిదేళ్లలో 20 వేల కోట్ల రూపాయల మేర పెట్టబడులు పెట్టబోతోన్నామని రాష్ట్రపతి అన్నారు. పాడిపరిశ్రమ రైతులకు అన్ని విధాలుగా సహకరించడానికి కొత్త విధానాలను అమలు చేస్తామని అన్నారు. 20 లక్షల మందికి సౌర విద్యుత్ ఆధారిత పంపుసెట్లను అందించామని అన్నారు. ముద్ర బ్యాంకుల ద్వారా మహిళలకు స్వయం సమృద్ధిని కల్పించడానికి రుణాలను అందజేస్తున్నామని రాష్ట్రపతి చెప్పారు.
రిపబ్లిక్ డే నాడు అవాంఛనీయ సంఘటనలు..
గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధానిలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. జాతీయ పతాకాన్ని అవమానించేలా ఆ ఘటనలు సాగాయని చెప్పారు. దేశ ప్రజలకు వాక్ స్వాతంత్య్రాన్ని కల్పించిన రాజ్యాంగమే.. శాంతిభద్రతలను పరిరక్షించడానికి కఠిన చట్టాలను కూడా రూపొందించిందని అన్నారు. రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందని రామ్నాథ్ కోవింద్ స్పష్టం చేశారు.