కేంద్ర బడ్జెట్లో కర్ణాటకకు ప్రత్యేక కేటాయింపులు: ఎన్నికల ఎఫెక్టే!
కర్ణాటకలోని కరవు, వెనుబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఆర్థిక సహకారం అందించనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ. 5,300 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
న్యూఢిల్లీ: బడ్జెట్ 2023లో అన్ని వర్గాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని పార్లమెంటులో బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. పార్లమెంటులో ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలు బడ్జెట్ అద్భుతంగా ఉందంటుండగా.. విపక్షాలు మాత్రం కొత్తగా ఏం లేదని మండిపడుతున్నారు.
మరోవైపు, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటక రాష్ట్రానికి నిధులు కేటాయించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కర్ణాటకలోని కరవు, వెనుబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఆర్థిక సహకారం అందించనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ. 5,300 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
29.4 టీఎంసీల సామర్థ్యంతో 2.25 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీటిని అందించేందుకు అప్పర్ భద్ర ప్రాజెక్టును కర్ణాటక ప్రభుత్వం చేపట్టింది. కరవు ప్రాంతాల్లో నీటి సరఫరాకు ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమని కర్ణాటక ఇప్పటికే పేర్కొంది. తాజాగా, కేంద్రం నిధులు కేటాయించడంపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హర్షం వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, ఈ ఏడాదిలోనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో కేంద్రం ఈసారి నిధులు కేటాయించడం రాజకీయంగా మారింది. ఈ ఏడాది మే 4తో కర్ణాటక అసెంబ్లీ గడువు ముగియనుంది. ఆలోపే అంటే మార్చి-ఏప్రిల్ నెలల్లో ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో ఎన్నికలు జరగనుండటం, ఈ రాష్ట్రం బీజేపీ పాలిత రాష్ట్రం కావడంతో విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ నిధులు కేటాయించారని ఆరోపిస్తున్నాయి.