రైతులకు కేంద్రం గుడ్ న్యూస్: కిసాన్ క్రెడిట్ కార్డులపై
Nirmala Sitharaman: దేశవ్యాప్తంగా కోట్లాదిమంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని దాదాపుగా రెట్టింపు చేసింది. ఈ మేరకు వార్షిక బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్.. ఈ విషయాన్ని ప్రకటించారు.
ప్రస్తుతం కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి మూడు లక్షల రూపాయల వరకు ఉంటోంది. ఈ కార్డు ద్వారా రైతులు ఆర్థిక పరమైన ప్రయోజనాలు పొందగలుగుతున్నారు. బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీ రేటుతో రుణాలను తీసుకుంటోన్నారు. వెసలుబాటు కలిగించే రీపేమెంట్ ఆప్షన్స్ వారికి అందుబాటులో ఉంది. బీమా కవరేజీ, సేవింగ్స్ అకౌంట్, స్మార్ట్ కార్డ్/ డెబిట్ కార్డుపై వడ్డీ రేటును సైతం రైతులు తీసుకోగలరు.

మూడు లక్షల రూపాయల వరకు ఉన్న కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని కేంద్ర ప్రభుత్వం తాజాగా అయిదు లక్షల రూపాయలకు పెంచింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7.7 కోట్ల మంది రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల స్వల్పకాలిక రుణాలను కిసాన్ క్రెడిట్ కార్డు సులభతరం చేస్తోందని నిర్మల సీతారామన్ అన్నారు.
వారి ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వడ్డీ రాయితీ పథకం కింద రుణ పరిమితిని 3 లక్షల నుండి 5 లక్షల రూపాయల వరకు పెంచినట్లు వెల్లడించారు. యూరియా ఉత్పత్తిలో స్వావలంబన సాధించడానికి తమ ప్రభుత్వం మూడు యూరియా యూనిట్లను పునః ప్రారంభించినట్లు చెప్పారు.
కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి రైతులు తప్పనిసరిగా యజమాని-సాగుదారు, వాటాదారు, కౌలు రైతు లేదా స్వయం-సహాయ బృందాల్లో సభ్యుడిగా ఉండాలి. నిర్దుష్ట అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే అధికారులు కిసాన్ క్రెడిట్ కార్డును జారీ చేస్తారు.
పంట ఉత్పత్తి లేదా పశుపోషణ, చేపల వేట వంటి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు చెందిన వారికి ఈ కార్డులను కేంద్రం అందిస్తుంది. ఇంతకుముందు రూ.1.60 లక్షలకు పైబడిన రుణాలకు గ్యారంటీ అవసరం ఉండేది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గ్యారెంటీ లేని రుణ పరిమితిని రూ.2 లక్షలకు పెంచింది.












Click it and Unblock the Notifications