ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్లా లేదు.. ఓట్లకోసమే అన్నట్లుగా ఉంది: చిదంబరం
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్పై అసంతృప్తి వ్యక్తం చేశారు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం. ఓట్ల కోసమే బడ్జెట్ అన్నట్లుగా ఉంది తప్పితే ఓటాన్ అకౌంట్ బడ్జెట్లా లేదని విమర్శించారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత చిదంబరం ట్విటర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అదే సమయంలో ఆర్థికశాఖ మంత్రి పీయుష్ గోయల్కు ధన్యవాదాలు చెప్పారు చిదంబరం. దేశంలోని వనరులకు ముందుగా హక్కు ఉండేది పేదలకే అన్న కాంగ్రెస్ డిక్లరేషన్ను పీయుష్ గోయల్ కాపీ కొట్టారని.. ఎద్దేవా చేశారు.
కేంద్ర బడ్జెట్లో బంపరాఫర్, నేరుగా రైతుల ఖాతాల్లోకి రూ.6వేలు
ఆర్థికలోటు బడ్జెట్ లక్ష్యాన్ని ప్రభుత్వం విస్మరించిందని అన్నారు చిదంబరం. ఇది ప్రమాదకరంగా మారే అవకాశముందని తాను అంతకుముందే హెచ్చరించినట్లు చెప్పారు చిదంబరం. పెద్ద నోట్ల రద్దుపై కూడా మోడీ ప్రభుత్వాన్ని కడిగిపారేశారు చిదంబరం. పెద్దనోట్లు రద్దు అయిన సంవత్సరం వృద్ధి రేటు 8.2శాతంగా ఉన్నిందని చెప్పిన చిదంబరం... మరో సారి డీమోనిటైజేషన్ చేయాలని ప్రధాని మోడీని కోరుతున్నట్లు సెటైర్ వేశారు. ఈ సారి 100 రూపాయల నోటును రద్దు చేయాలని చెప్పారు ప్రధాని మోడి.
జీడీపీ లెక్కలను మోడీ ప్రభుత్వం ప్రతిసారి మారుస్తోందని అదే సమయంలో నిరుద్యోగుల సంఖ్య కూడా పెరుగుతోందన్న సంగతిని విస్మరించిందని అన్నారు చిదంబరం. ఇక ఆ సంఖ్యను కూడా మసిపూసి మారేడు కాయ చేసి ఉన్నింటే బాగుండేదని ధ్వజమెత్తారు చిదంబరం. ఉద్యోగాల కల్పన లేకుండా దేశం ఏవిధంగా 7శాతం వృద్ధి నమోదు చేస్తుంది అని నీటి ఆయోగ్ ఛైర్మెన్ ప్రశ్నించారని గుర్తు చేసిన చిదంబరం కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే ప్రశ్నను ప్రభుత్వానికి సంధిస్తోందని ఇందుకు సమాధానం చెప్పాలని చిదంబరం డిమాండ్ చేశారు.