మోడీ హింట్: బడ్జెట్ ప్రజారంజకంగా ఉండదా? నేడు ఆల్ పార్టీ మీటింగ్
Recommended Video
న్యూఢిల్లీ: ఈసారి బడ్జెట్ ప్రజాకర్షంగా, అందరినీ మెప్పించే విధంగా ఉండబోదని చాలామంది భావిస్తున్నారు. అదే సమయంలో నిమ్న వర్గాల అభ్యున్నతి, వ్యవసాయరంగానికి ఊతం వంటివి ఉంటాయని చెబుతున్నారు. తద్వారా రాజకీయ అవసరాలను బడ్జెట్ ప్రతిబింబిస్తుందని అంటున్నారు.
సామాన్యుడు కోరుకునేది నిజాయితీ అని, తాను ఎంత, ఏది పొందడానికి అర్హుడో దానిని మాత్రమే ఆశిస్తాడని, రాయితీలు, తాయిలాలు, ఉచితాలు కోరుకోడని ప్రధాని మోడీ చెబుతున్నారు. అలా కోరుకుంటాడని ఎవరైనా అనుకుంటే అది భ్రమే అంటున్నారు. తాను సామాన్యుడిని విశ్వసిస్తానని, అతని లేక ఆమె ఆశలను గౌరవిస్తానని, వారి అవసరాలు, ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
ఈ వ్యాఖ్యల ద్వారా రాబోయే బడ్జెట్ అంత ప్రజారంజకంగా ఉండదని అర్థమవుతోందని నిపుణులు అంటున్నారు. వార్షిక బడ్జెట్ను ఫిబ్రవరి 1వ తేదీన లోకసభలో ప్రవేశ పెట్టనున్నారు. వచ్చే ఎన్నికలకు ముంది జైట్లీకి ఇది చివరి బడ్జెట్. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఈ బడ్జెట్కు ప్రాధాన్యత మరింత పెరిగింది. ఇదిలా ఉండగా, బడ్జెట్ సమావేశాల నిమిత్తం ఆదివారం ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది.