"గోడలు కాదు వంతెనలు కట్టండి"- కేంద్రం తీరుపై రాహుల్ ఫైర్- రైతులకు అడ్డుగోడలా ?
ఢిల్లీలో రైతుల నిరసనల సెగ కేంద్రానికి రోజుకో రకంగా తలుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులను అడ్డుకునేందుకు ఏకంగా గోడలు కట్టేస్తున్నారు. దీనిపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రైతులపై కేంద్రం వైఖరిని తప్పుబడుతూ కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు రైతులను అడ్డుకునేందుకు గోడల నిర్మాణంతో పాటు కాంక్రీట్ కట్డడాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వీటి మధ్యలో ఇనుప మేకులను కూడా పెడుతున్నారు. దీంతో రైతులను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు అనుసరిస్తున్న తీరుపై సాధారణ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇదే క్రమంలో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ కేంద్రం తీరుపై మండిపడ్డారు. గోడలు కాదు వంతెనలు కట్టండి అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లోనే ఢిల్లీ పోలీసులు ఏర్పాటు చేస్తున్న గోడల ఫొటోలను కూడా ఉంచారు.
ఢిల్లీ సరిహద్దులకు భారీగా తరలివస్తున్న రైతులను అడ్డుకునేందుకు కొన్ని రోజులుగా పోలీసులు చేయని ప్రయత్నం లేదు. అయినా రైతుల రాక ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో ముందుజాగ్రత్త చర్యగా ఢిల్లీ పోలీసులు ఏకంగా గోడల నిర్మాణానికే సిద్ధమయ్యారు. సరిహద్దుల్ని పూర్తిగా మూసేసేలా ఉన్న ఈ గోడల మధ్యలో ఇనుప మేకుల్ని ఉంచడం, ఐరన్ వైర్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలతో రైతులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో రైతులపై కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
GOI,
— Rahul Gandhi (@RahulGandhi) February 2, 2021
Build bridges, not walls! pic.twitter.com/C7gXKsUJAi