ఢిల్లీ పోలీసును తుపాకీతో బెదిరించాడు: కాల్పులు జరిపిన షారుక్ అరెస్ట్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అల్లర్లు కొనసాగుతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు మద్దతు, వ్యతిరేక వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో ఆదివారం మొదలైన అల్లర్లు మంగళవారం వరకూ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఓ పోలీసుతోపాటు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పలు ఇళ్లు, వాహనాలకు నిప్పు పెట్టడంతో భారీ ఆస్తి నష్టం కూడా జరిగింది.
కాగా, సీఏఏకు వ్యతిరేక ఆందోళనల్లో ఓ నిరసనకారుడు తుపాకీతో బీభత్సం సృష్టించాడు. అంతేగాక, అక్కడే విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు కానిస్టేబుల్ను తుపాకీ చూపిస్తూ బెదిరింపులకు గురిచేశాడు. జఫ్రాబాద్లో సోమవారం చోటు చేసుకుందీ ఘటన. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి.
ఈ క్రమంలో విచారణ చేపట్టిన ఢిల్లీ పోలీసులు ఆ వ్యక్తిని షారుక్(33)గా గుర్తించి అరెస్టు చేశారు. అతడు ఢిల్లీలోని షాదర ప్రాంతానికి చెందిన వ్యక్తని పోలీసులు వెల్లడించారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. ఎరుపు రంగు టీషర్ట్ ధరించిన షారుక్.. చేతిలో తుపాకీ పట్టుకుని విధుల్లో ఉన్న పోలీసును బెదిరించాడు.

దగ్గరకు వస్తే కాల్చిపడేస్తానంటూ హెచ్చరించాడు. అంతేగాక, గాల్లోకి కాల్పులు కూడా జరిపాడు. దీంతో చేతిలో ఎలాంటి ఆయుధం లేకుండా ఉన్న సదరు కానిస్టేబుల్ వెనక్కి వెళ్లిపోయాడు. కాల్పులు జరిపిన నేపథ్యంలో సీఏఏకు అనుకూలంగా నిరసన చేస్తున్నవారు అక్కడ్నుంచి భయంతో పరుగులు తీశారు.
మంగళవారం కూడా సీఏఏ ఆందోళనకారులు నిరసనలు చేపడుతున్నారు. ఈశాన్య ఢిల్లీలో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఢిల్లీ గవర్నర్ అనిల్ బైజల్, సీఎం అరవింద్ కేజ్రీవాల్, పలువురు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారులను పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.
కాగా, ఢిల్లీ ఘర్షణల్లో ఇప్పటికే ఏడుగురు మృతి చెందగా, 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిలో డీసీపీ సహా 11 మంది పోలీసులు ఉండటం గమనార్హం. మరో ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బంది కూడా ఆందోళనకారుల రాళ్ల దాడిలో గాయపడ్డారు.












Click it and Unblock the Notifications