మరో ఛాన్స్, దెబ్బకు దెబ్బ: బ్యాంకులో లెక్కలేని డబ్బుపై మోడీ కొరడా
బ్యాంకు అకౌంట్లలో జమ అవుతున్న లెక్కల్లో లేని డబ్బు పైన 60 శాతం ఆదాయ పన్ను విధించాలని కేంద్రం యోచిస్తోంది.
న్యూఢిల్లీ: బ్యాంకు అకౌంట్లలో జమ అవుతున్న లెక్కల్లో లేని డబ్బు పైన 60 శాతం ఆదాయ పన్ను విధించాలని కేంద్రం యోచిస్తోంది. గురువారం ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో నోట్ల రద్దు, తదనంతర పరిణామాలపై చర్చించారు.
జన్ ధన్ అకౌంట్లలో రూ.21 వేల కోట్లకు పైగా డబ్బులు చేరినట్లు వెల్లడైన నేపథ్యంలో అత్యవసరంగా జరిగిన ఈ భేటీ ఆసక్తిగా మారింది. కేబినెట్ భేటీ సమావేశం వివరాలు వెల్లడించనప్పటికీ.. విశ్వసనీయ సమాచారం ప్రకారం లెక్కల్లో లేని డబ్బును డిపాజిట్ చేస్తే దానిపై అరవై శాతం ఆదాయపు పన్ను విధించడంపై చర్చించారని తెలస్తోంది.
తద్వారా, లెక్కల్లో చూపించని మొత్తాలను బ్యాంకుల్లో జమ చేస్తున్న వారిపై కేంద్రం 60 శాతం పన్నుతో కొరడా ఝళిపించనుంది. రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రకటన అనంతరం నిర్ణీత పరిమితికి మించి బ్యాంకుల్లో జరుగుతున్న ఇలాంటి డిపాజిట్లపై ఆ మేరకు ఆదాయపు పన్ను విధించబోతున్నారు.
ఈ మేరకు ఆదాయపు పన్ను చట్టానికి సవరణలు చేయాలని కేంద్ర మంత్రిమండలి సమావేశంలో నిర్ణయించిందని తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన గురువారం రాత్రి ఎనిమిది గంటలకు కేంద్ర మంత్రి మండలి హడావుడిగా సమావేశమయింది.
సాధారణంగా కేబినెట్ సమావేశం అనంతరం అధికారికంగా వివరాలు వెల్లడిస్తారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున ఇతర వేదికల పైన వివిధ నిర్ణయాలు ప్రకటించవద్దు. దీంతో వివరాలు వెల్లడించలేదు.
కేంద్రం మరో షాక్, నేటి నుంచి నోట్ల మార్పిడి లేదు, రూ.500 ఇలా వినియోగించవచ్చు
జీరో అకౌంటుతో మొదలైన జన్ ధన్ ఖాతాల్లో దాదాపు రూ.21,000 కోట్లు గత రెండు వారాల్లోనే జమ అయిందని బ్యాంకులు నివేదించిన విషయాన్ని కేబినెట్లో చర్చించారని సమాచారం. ఇందులో ఎక్కువ మొత్తం నల్లధనం ఉండవచ్చునని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
లెక్కల్లో చూపకుండా బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో జమ చేసిన మొత్తాలన్నింటిపై పన్ను విధించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. గుప్త ఆదాయాన్ని వెల్లడించడానికి ప్రకటించిన పథకంలో పన్ను, అపరాధ రుసుముల రూపేణా 45% వసూలు చేసినందు వల్ల ఇప్పుడు దానికంటే ఎక్కువే ఉండాలని సర్కారు యోచిస్తోంది.
విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని గత ఏడాది వెల్లడించిన వారు అరవై శాతం పన్నును చెల్లించడంతో తాజాగా బినామీ డిపాజిట్ల పైనా అదే స్థాయిలో విధించాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. దీనికి అవసరమైన చట్ట సవరణ బిల్లును పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు.