పార్టీ, కుమారుడా ? : ప్రచారం చేయకుంటే క్యాబినెట్ నుంచి తప్పుకో, హిమాచల్ సీఎం అల్టిమేటం
సిమ్లా : సార్వత్రిక ఎన్నికల వేళ హిమాచల్ ప్రదేశ్ సీఎం జై రామ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన సహచర మంత్రి అనిల్ శర్మ .. మంది నియోజకవర్గంలో ప్రచారం చేయాలని స్పష్టంచేశారు. క్యాంపెయిన్ చేయకుంటే క్యాబినెట్ నుంచి తప్పిస్తానని, బీజేపీ పార్టీ నుంచి కూడా వైదొలగాలని హుకుం జారీచేశారు.
పార్టీ కార్యకర్తగా బాధ్యత
మంది నియోజకవర్గం కోసం ప్రచారం చేయాలని .. అది తమ బాధ్యత అని ఉద్గాటించారు రామ్ ఠాకూర్. ఒకవేళ ప్రచారం చేయకుంటే పార్టీ, పదవీ నుంచి తప్పుకోవాలని సూచించారు. లేదంటే తానే తప్పిస్తానని స్పష్టంచేశారు. మంది నియోజకవర్గంలో జరిగిన ప్రచారంలో సీఎం జై రామ్ ఠాకూర్ ప్రసంగిస్తూ .. తనకు సంబంధించి దేశమే సుప్రీం అని, కానీ అనిల్ శర్మకు కుటుంబమే ముఖ్యమని విమర్శించారు. అనిల్ శర్మ తండ్రి మాజీ కేంద్రమంత్రి సుఖ్ రాం, ఈయన కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. అంతేకాదు అనిల్ శర్మ కుమారుడు అశ్రయ్ శర్మ కాంగ్రెస్ పార్టీ నుంచి మంది నుంచి బరిలోకి దిగారు. ఈ సందర్భంగా అనిల్ శర్మను ఉద్దేశించి సీఎం .. విమర్శలు గుప్పించారు.
సుఖ్ రాంపై విమర్శలు
పనిలోపనిగా పండిట్ సుఖ్ రాంపై విమర్శలు చేశారు సీఎం జై రామ్ ఠాకూర్. 'సుఖ్ రాం సీనియర్ నేత, అతని రాజకీయ జీవితం ముగిసింది, వయస్సు దృష్టా రాజకీయాలకు దూరంగా ఉండాలి. కానీ ఆయన తన కుమారుడు, మనవడు రాజకీయాలను ప్రభావితం చేసి .. నాశనం చేస్తున్నారని పేర్కొన్నారు. మంది నియోజకవర్గం నుంచి సిట్టింగ్ బీజేపీ ఎంపీ రాం స్వరూప్ శర్మ బరిలోకి దిగారు.
తండ్రి, కుమారుడు, మనవడు : రాజకీయం
సుఖ్ రాం మంది నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎంపీగా విజయం సాధించారు. ఆయన మనవడు ఆశ్రయ్ శర్మ మార్చి 25న కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంది నియోజకవర్గానికి సంబంధించి అనిల్ శర్మ ముందే క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ కోసం ప్రచారం నిర్వహిస్తానని, కానీ కుమారుడికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ నిర్వహించబోనని మెలికపెట్టారు. ఓ బీజేపీ కార్యకర్తగా పార్టీ కోసం ఇతర నియోజకవర్గాల్లో పనిచేస్తానని మాత్రం స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీ నుంచి వైదొలగలాని సీఎం జై రామ్ ఠాకూర్ స్పష్టంచేశారు.