22 లక్షల మంది విద్యార్థులతో ప్రతిజ్ఞ.. మహిళా భద్రతకు ఢిల్లీ సర్కార్ వినూత్న కార్యక్రమం
ఇటీవల దిశా హత్యాచార ఘటన నేపథ్యంలో మహిళా భద్రతపై దేశవ్యాప్తంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఎన్కౌంటర్లో నిందితులను మట్టుబెట్టడంతో ప్రజల ఆగ్రహావేశాలు శాంతించాయి. దీంతో ఆ చర్చకు నెమ్మదిగా ఫుల్ స్టాప్ పడింది. సంఘటనలు జరిగినప్పుడే ప్రభుత్వాలు,పౌర సమాజం స్పందించడం కామన్గా మారిపోయింది. కానీ ఢిల్లీ సర్కార్ మాత్రం సమస్య మూలాల్లో నుంచి దానికి పరిష్కారం వెతికే పనిలో నిమగ్నమైంది.
స్కూల్ దశలోనే విద్యార్థులకు తోటి విద్యార్థినులు,మహిళలను గౌరవించడం నేర్పాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఢిల్లీలోని 22లక్షల మంది విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించింది. తోటి విద్యార్థినులు,మహిళలను గౌరవిస్తామని.. వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించమని వారితో ప్రతిజ్ఞ చేయించింది.మహిళా భద్రతా కోసం చేపట్టిన ఈ క్యాంపెయిన్ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు.
కేవలం పోలీస్ వ్వవస్థ,న్యాయ వ్యవస్థలను మెరుగుపర్చడమే కాకుండా.. మహిళల పట్ల సొసైటీ మైండ్ సెట్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని కేజ్రీవాల్ అన్నారు. రాత్రి వేళల్లోనూ మహిళలు ఎలాంటి భయం లేకుండా సంచరించేలా ఢిల్లీని తీర్చిదిద్దాలనుకుంటున్నామని పేర్కొన్నారు.
ఢిల్లీలోని అన్ని స్కూళ్లల్లో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించామని చెప్పారు. విద్యార్థినులు కూడా ఇంటికెళ్లి వారి అన్నాదమ్ములతో ప్రతిజ్ఞ చేయించాలని, మహిళలను గౌరవించమని వారితో చెప్పాలని అన్నారు. ఒకవేళ ఎవరైనా మహిళల పట్ల తమ సోదరులు అసభ్యంగా ప్రవర్తిస్తే.. వారితో బంధాన్ని తెంచుకుంటామని చెప్పాలన్నారు. ఈ మేరకు కేజ్రీవాల్ ట్విట్టర్లో ట్వీట్స్ చేశారు.