రాహుల్ 'ప్రధాని' వ్యాఖ్యలపై మమత అనుమానం, బీజేపీకి శత్రుఘ్నుసిన్హా షాక్
కోల్కతా: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే తాను ప్రధానమంత్రిని అవుతానని వ్యాఖ్యానించిన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు.
ఎవరి అభిప్రాయాలను వారు చెప్పుకునే హక్కు ఉందని వ్యాఖ్యానించారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశాలు కనిపించడం లేదని ఆమె అన్నారు. సొంతగా ఆ పార్టీ ఎక్కువ సీట్లు దక్కించుకోకపోవచ్చునని చెప్పారు.
అది రాహుల్ గాంధీ హక్కు
'రాహుల్ గాంధీ తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయవచ్చు. అది ఆయనకు ఉన్న హక్కు. కానీ కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో అతి ఎక్కువ సీట్లు గెలుచుకొని పెద్ద పార్టీగా అవతరిస్తుందా? పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి సొంతగా మెజార్టీ వచ్చే అవకాశాలు లేవు' అని మమతా బెనర్జీ అన్నారు.
దానికి సమాధానం చెప్పని మమత
ఫెడరల్ ఫ్రంట్ ఇక శరణ్యమని, అదే భవిష్యత్తు అని మమతా బెనర్జీ చెప్పారు. నేను గానీ, మిగిలిన ప్రాంతీయ పార్టీలు గానీ దీనినే సమర్థిస్తామని చెప్పారు. మీరు ఫెడరల్ ఫ్రంట్కు నేతృత్వం వహిస్తారా అని మీడియా అడిగితే.. ఆమె సమాధానం చెప్పలేదు.
తెలివిగా మంత్రాంగం నెరిపి ఉండాల్సింది
కర్నాటకలో ఏ పార్టీకి మెజార్టీ వస్తుందని ప్రశ్నించగా. ఏ పార్టీకి మెజార్టీ వచ్చే అవకాశాలు లేవని, జేడీఎస్ కింగ్ మేకర్గా అవతరించవచ్చునని మమతా బెనర్జీ చెప్పారు. కింగ్ అయినా అశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. దేవేగౌడతో కాంగ్రెస్ మరింత తెలివిగా మంత్రాంగం నెరపి ఉండాల్సిందన్నారు.
శత్రుఘ్ని సిన్హా సంచలన వ్యాఖ్యలు
మరోవైపు, ఈ దేశంలో ఎవరైనా ప్రధానమంత్రి కావొచ్చునని బీజేపీ ఎంపీ శత్రుఘ్ను సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో అతిపెద్ద, అతి పురాతన పార్టీకి నేతృత్వం వహిస్తున్న వ్యక్తి, బహుళ జనాదరణ గల వ్యక్తి ప్రధాని కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయడం తప్పు కాదని, రాహుల్ గత రెండేళలో ఎంతో పరిణితి సాధించారన్నారు.