విజయ్ మాల్యా కోసం ఎంతో కాలం ఎదురు చూడలేం: సుప్రీంకోర్టు అసహనం: జనవరి 18న లిస్టింగ్
న్యూఢిల్లీ: వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాను స్వదేశానికి రప్పించే విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన కోసం ఎంతో కాలం ఎదురు చూడలేమని స్పష్టం చేసింది. కోర్టుధిక్కారణ కేసు విషయంలో శిక్షను ఖరారు చేస్తామని తెలిపింది. దీనికి సంబంధించిన కేసుపై తదుపరి విచారణను వచ్చే సంవత్సరం జనవరి 22వ తేదీకి వాయిదా వేసింది.
విజయ్ మాల్యా ప్రస్తుతం యూకేలో తలదాచుకుంటోన్న విషయం తెలిసిందే. ఆరు సంవత్సరాల కిందటే ఆయన దేశం విడిచి పారిపోయాడు. స్వదేశానికి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం తన ప్రయత్నాలు సాగిస్తోంది గానీ అవేవీ ఫలించట్లేదు. ఎప్పటికప్పుడు బెడిసికొడుతున్నాయి. విజయ్ మాల్యాపై కోర్టు ధిక్కారణ కేసు కూడా నమోదైంది. ఆయన కోర్టుకు హాజరు కాకపోవడం వల్ల ఈ కేసు లిస్టింగ్, వాదనలు, తీర్పును సుప్రీంకోర్టు వాయిదా వేస్తూ వస్తోంది. ఈ మధ్యాహ్నం మరోసారి దీనిపై సుప్రీంకోర్టు స్పందించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కింగ్ ఫిషర్ మధ్య రుణ ఎగవేత వ్యవహారం నేపథ్యంలో 2017లో విజయ్ మాల్యాపై కోర్టు ధిక్కారణ కేసు నమోదైంది. తన తరఫున వాదనలను వినిపించడానికి కేంద్ర ప్రభుత్వం సీనియర్ అడ్వొకేట్ జైదీప్ గుప్తాను నియమించింది. ఆయనతో పాటు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలను వినిపిస్తున్నారు. జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసు పురోగతి గురించి ఆరా తీసింది. లిస్టింగ్ చేయాలని నిర్ణయించింది.
ఇప్పటిదాకా న్యాయవాది మాత్రమే హాజరువుతున్నారని, ఆరోపణలను ఎదుర్కొంటోన్న వ్యక్తి ఒక్కసారి కూడా న్యాయస్థానానికి రాలేదని జస్టిస్ యూయూ లలిత్ అన్నారు. ఇక శిక్ష ఖరారు చేసే విషయంలో తాము ముందుకే వెళ్తామని తేల్చి చెప్పారు. విజయ్ మాల్యా కోసం ఇక ఎంతో కాలం ఎదురు చూడలేమని, 2017లో నమోదైన ఈ కేసు ఇప్పటిదాకా లిస్టింగ్లోకి రాలేదని అసహనాన్ని వ్యక్తం చేశారు. విజయ్ మాల్యాను ఇంకెప్పుడు స్వదేశానికి తీసుకొస్తారని ప్రశ్నించారు. ఈ కేసును జనవరిలో డిస్పోజ్ చేస్తామని స్పష్టం చేశారు.
ఇప్పటిదాకా ఎంతకాలం ఎదురు చూడాలో.. అంతకాలం ఎదురు చూశామని, ఇంకా ఎప్పుడు అతన్ని స్వదేశానికి తీసుకొస్తారని సుప్రీంకోర్టు ధర్మాసనం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించింది. పగలు రాత్రి అనే ప్రక్రియ ముగిసిందని స్పష్టం చేసింది. జనవరి రెండో వారంలో ఈ కేసును లిస్ట్ చేస్తామని పేర్కొంది. అప్పటికీ నిందితుడు వ్యక్తిగతంగా కోర్టుకు రాలేకపోయినప్పటికీ.. అతని తరఫు న్యాయవాది ఇక్కడే ఉంటారని వ్యాఖ్యానించింది.