పెళ్లి ఇంటిలో విషాదం: చెట్టును ఢీకొట్టిన క్యాంటర్: 12 మంది దుర్మరణం, 20 మందికి తీవ్రగాయాలు!
బెంగళూరు: శుభకార్యానికి వెలుతున్న సమయంలో మినీలారీ (క్యాంటర్) అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొని పల్టీ కొట్టడంతో 12 మంది దుర్మరణం చెంది 20 మందికిపైగా తీవ్రగాయాలైన ఘటన కర్ణాటకలోని మండ్య జిల్లాలో జరిగింది. తీవ్రగాయాలైన బాధితులు మండ్య, మైసూరు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.
మండ్య జిల్లా మద్దూరు తాలుకా యడేనహళ్ళి గ్రామంలో నివాసం ఉంటున్న రాజన్న అనే ఆయన కుమార్తె పెళ్లికి శివపురలోని శ్రీ వెంకటేశ్వర కల్యాణ మండపంటో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఉదయం పెళ్లి జరగనుంది. యడేనహళ్ళి గ్రామంలో నివాసం ఉంటున్న వారు పెళ్లికి వెళ్లడానికి సిద్దం అయ్యారు.
ఆదివారం రాత్రి పొద్దుపోయిన తరువాత గ్రామస్తులు మినీలారీలో పెళ్లికి బయలుదేరారు. మార్గం మధ్యలో తుమకూరు-కోళ్లేగాల జాతీయ రహదారిలో మినీలారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పెద్ద చెట్టును ఢీకొని పల్టీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే మినీలారీ డ్రైవర్ పరారైనాడు.
ఈ ప్రమాదంలో యడేనహళ్ళికి చెందిన బీరమ్మ (50), సరోజమ్మ (55), జయమ్మ (55), పార్వతమ్మ (60), మాదమ్మ (60), శివన్న (45), పూజా (16), కరియప్ప (45), శృతి (3), కమలమ్మ (75), కరియప్ప(57) మరో వ్యక్తి మరణించారు. డ్రైవర్ నిర్లక్షం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.
తీవ్రగాయాలైన 20 మందిని మండ్య జిల్లా ఆసుపత్రి, మైసూరు ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిందని విషయం తెలుసుకున్న స్థానిక శాసన సభ్యుడు డీసీ తమ్మన్న, జిల్లా పోలీసు కమిషనర్ రాధికా, డీఎస్పీ మల్లిక్, తహసిల్దార్ నాగరాజు, బీజేపీ తాలుకా అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్, జిల్లా పంచాయితీ సభ్యురాలు సుచితా మనుకుమార్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు.