కొవిడ్ బీభత్సం... 30 రోజుల్లో..
కరోనా వైరస్ తొలిసారి వెలుగు చూసినప్పుడు కోట్ల మందికి వైరస్ సోకి బాధ పడటంతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని నెలలుగా కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. దాదాపుగా ఈ వైరస్ అంతరించిపోయింది అనుకుంటున్న సమయంలో భారీగా పెరుగదల కనిపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న లెక్కలైతే మరింత భయాన్ని కలిగిస్తున్నాయి. నెలరోజుల వ్యవధిలో ప్రపంచ దేశాల్లో కొత్త కొవిడ్ కేసుల సంఖ్య 52 శాతం పెరిగిందని డబ్ల్యూహెచ్ఓ తాజాగా వెల్లడించింది.
ప్రపంచంలోని అన్ని దేశాల్లో కలిపి 8.5 లక్షల కొత్త కొవిడ్ కేసులు నెలరోజుల వ్యవధిలో బయటపడ్డాయి. వీరిలో 1.18 లక్షల మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. కరోనా వల్ల 3 వేల మందికిపైగా మరణించారు. కేసుల పెరుగుదలకు కొవిడ్ కొత్త రకం జేఎన్ 1 అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది.

కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుదల మరో రెండు నెలల పాటు కొనసాగుతుందని, ప్రపంచ దేశాలపై కొవిడ్ పడగ తప్పదనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు భారత్లో కూడా కేసుల సంఖ్య పెరుగుతుండటం సంచలనంగా మారింది. జేఎన్ 1 వేరియంట్ అంత ప్రమాదకరం కాదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా టీకాలు జేఎన్ 1 రకం వల్ల కలిగే ప్రాణాపాయాన్ని.. తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. కరోనాతోపాటు ఫ్లూ, పిల్లల్లో వచ్చే సాధారణ నిమోనియా వంటి శ్వాసకోశ వ్యాధుల తీవ్రత కూడా ఎక్కువగా ఉందని ప్రకటించింది. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచిస్తోంది.












Click it and Unblock the Notifications