యూపీలో పాగా వేయాలంటే...విభజన తప్పదా: బీజేపీ కొత్త వ్యూహం-యోగీకి అక్కడే చెడిందా..!
గత కొన్ని రోజులుగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ బీజేపీ హైకమాండ్ మధ్య ఏదో రచ్చ నడుస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే యోగీని తప్పించి మరొకరికి ఉత్తర్ ప్రదేశ్ బాధ్యతలు అప్పగిస్తారని, అదే సమయంలో కేబినెట్ విస్తరణ కూడా చేపట్టాలనే యోచనలో బీజేపీ హైకమాండ్ ఉందంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగింది. అయితే యోగీకి కేంద్ర నాయకత్వానికి మధ్య మరో అంశంలో చెడిందనే కొత్త వాదన తెరపైకి వచ్చింది. ఇంతకీ ఆ వాదనేంటి..?
Recommended Video

రంగంలోకి బీజేపీ హైకమాండ్
గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఉత్తర్ ప్రదేశ్ రాజకయాలు. సీఎం యోగీ ఆదిత్యనాథ్కు-ప్రధాని మోడీ-అమిత్ షాలతో బేదాభిప్రాయాలు వచ్చాయనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ క్రమంలోనే గురువారం అమిత్ షాను శుక్రవారం ప్రధాని మోడీని యోగీ ఆదిత్యనాథ్ కలవడం జరిగింది. అయితే వీరంతా రానున్న ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల గురించే చర్చించినట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఉత్తర్ప్రదేశ్లో యోగీ సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. ఇక దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే అసలుకే ఎసరొస్తుందని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. మొన్నామధ్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బోల్తా పడగా.. ప్రధాని ప్రాతినిథ్య వహిస్తున్న వారణాసిలో కూడా చేదు ఫలితాలే బీజేపీకి ఎదురయ్యాయి. ఇక లాభం లేదని భావించిన అగ్రనాయకత్వం రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టే పని ప్రారంభించింది.

ప్రత్యేక రాష్ట్రంగా పూర్వాంచల్
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీ విభజన రాజకీయాలకు తెరలేపిందని తెలుస్తోంది. అంటే పెద్ద రాష్ట్రాలను రెండు రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడంలో ఎప్పుడూ ముందుండే బీజేపీ ఈ సారి ఉత్తర్ ప్రదేశ్ను రెండుగా విడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇది కూడా రాజకీయ లబ్ధి కోసమేనంటూ పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా పూర్వాంచల్ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రధానికి నమ్మిన బంటు మాజీ బ్యూరోక్రాట్ అయిన ఏకే శర్మను ఉత్తర్ప్రదేశ్కు పంపి ఆ వెంటనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంవంటివి చకచకా జరిగిపోయాయి. వారణాసిలో కరోనా నిర్వహణలో ఉన్న ఏకే శర్మను అక్కడి నుంచి తీసుకొచ్చి మరీ చట్టసభలకు ఎంపిక చేసింది.

అసంతృప్తితో యోగీ ఆదిత్యనాథ్
ఒకవేళ పూర్వాంచల్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అయితే యోగీ సొంత నియోజకవర్గం గోరఖ్పూర్ కొత్త రాష్ట్రంలోకి వస్తుంది. గోరఖ్పూర్ నియోజకవర్గంలో యోగీకి మంచి బలం ఉంది. ఇక్కడి నుంచి ఐదు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు బీజేపీ హైకమాండ్ ఇదే ఆలోచన చేస్తోంది. పూర్వాంచల్లో 23 నుంచి 25 జిల్లాలు ఏర్పాటు చేసి 125 అసెంబ్లీ స్థానాలు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రత్యేక రాష్ట్రంపై యోగీ ఆదిత్యనాథ్ అతని వర్గం సంతృప్తికరంగా లేరని సమాచారం. అంతేకాదు పూర్వాంచల్, బుందేల్ఖండ్, హరిత్ ప్రదేశ్ పేర్లతో ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు చేయాలంటూ గత కొంతకాలంగా డిమాండ్ ఉంది. అయితే యోగీ సర్కార్ పూర్వాంచల్ అభివృద్ధి కోసం 28 రాష్ట్రాలను ఎంపిక చేసింది.

పూర్వాంచల్ రాజకీయ ముఖచిత్రం
ఇక పూర్వాంచల్లో ఏ పార్టీ అయితే మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తుందో ఆ పార్టీనే ఉత్తర్ ప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే బలమైన నమ్మకం అక్కడ రాజకీయవర్గాల్లో ఉంది.గత 27 ఏళ్ల చరిత్రను చూస్తే పూర్వాంచల్ ఓటర్లు ఎప్పుడూ ఒకే పార్టీ వైపు నిలవలేదనే అంశం అర్థమవుతుంది. పూర్వాంచల్లో బీజేపీకి పెద్దగా ఓటు బ్యాంకు లేదని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. పూర్వాంచల్లో ఎన్నికల సమయంలో మతం, మరియు కులం అనే రెండు అంశాలు తీవ్ర ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. అందుకే కొన్ని సార్లు బ్రాహ్మణ-దళిత-ముస్లిం సమీకరణాలతో బీఎస్పీ, ముస్లిం- యాదవ్ సమీకరణాలపై సమాజ్వాదీ పార్టీలకు మెజార్టీ వస్తుంది. ఎప్పుడైతే హిందుత్వ అంశంను బీజేపీ లేవనెత్తిందో ఆ సమయంలో కమలం పార్టీకి ఇక్కడ మెజార్టీ వచ్చింది.2014లో ప్రధానిగా మోడీ అయ్యాక 2017లో జరిగిన ఎన్నికల్లో హిందుత్వ అజెండాతోనే పూర్వాంచల్లో బీజేపీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది. 1991లో బలపడ్డ బీజేపీ ఆ తర్వాత ఎలాంటి హిందుత్వ అంశాలు లేకపోవడంతో బలహీనపడింది. మొత్తానికి ప్రత్యేక పూర్వాంచల్ రాష్ట్రం ఏర్పాటు చేసి అక్కడ బీజేపీ పాగా వేయాలనే యోచనలో ఉంది.












Click it and Unblock the Notifications