హీరో కమల్ హాసన్ కు సినిమా కష్టాలు: కేసు నమోదు చెయ్యండి: మద్రాసు హైకోర్టు ఆదేశాలు !
డెండ్యూ జ్వరం నివారించడానికి ప్రజలకు పంపిణి చేస్తున్న నీలవేంబు ఆయుర్వేద ఔషదంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు,
చెన్నై: డెండ్యూ జ్వరం నివారించడానికి ప్రజలకు పంపిణి చేస్తున్న నీలవేంబు ఆయుర్వేద ఔషదంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు, దర్శకుడు కమల్ హాసన్ మీద కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టాలని బుధవారం మద్రాసు హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
తమిళనాడులో కొంత కాలంగా డెంగ్యూ జ్వరం తాండవం చేస్తుంది. డెంగ్యూ జర్వం నివారించడానికి తమిళనాడు ప్రభుత్వంతో పాటు కొన్ని రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్చంద సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా నీలవేంబు ఆయుర్వేద ఔషదం పంపిణి చేస్తున్నారు.
కమల్ హాసన్ ప్రకటన కలకలం
నీలవేంబు ఆయుర్వేద ఔషదం పరిశోధించకుండానే ప్రజలకు పంపిణి చేస్తున్నారని, ఆ ఔషదం వలన డెంగ్యూ జర్వం తగ్గదని, ప్రజలు దానిని తీసుకోరాదని ప్రముఖ నటుడు కమల్ హాసన్ సోషల్ మీడియాలో ప్రజలకు మనవి చేశారు. ఈ విషయంపై మీడియా ముందు వివరణ ఇవ్వడంతో కలకలం రేపింది.
కమల్ హాసన్ పై చర్యలు తీసుకోండి
కమల్ హాసన్ వ్యాఖ్యలతో ప్రజలు గందరగోళానికి గురైనారని, డెంగ్యూ జ్వరం నివారించడానికి అందరూ ప్రయత్నిస్తుంటే ఆయన నీలవేంబు ఔషదం విషయంలో ఆందోళన కలిగించే వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని సమాజసేవకుడు జీ. దేవరాజన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కమల్ హాసన్ మీద కేసు నమోదు
బుధవారం పిటిషన్ విచారణ చేసిన మద్రాసు హైకోర్టు కమల్ హాసన్ వ్యాఖ్యలపై ఉన్న ఆధారాలు పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ చెయ్యాలని మద్రాసు హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై సమాజ సేవకుడు దేవరాజన్ కొన్ని సాక్షాలను మద్రాసు హైకోర్టుకు సమర్పించారు.
అభిమానులకు కమల్ సందేశం
తమిళనాడు ప్రభుత్వం మీద కొంత కాలంగా కమల్ హాసన్ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. నీలవేంబు ఔషదాన్ని తన అభిమానులు ఎవ్వరూ ప్రజలకు పంపిణి చెయ్యరాదని, ఆ ఔషదాన్ని నిపుణులు పరిశీలించలేదని కమల్ హాసన్ తన ఫ్యాన్స్ క్లబ్ కు పిలుపునిచ్చారు.
ప్రభుత్వం, ప్రతిపక్షం
కమల్ హాసన్ వ్యాఖ్యలతో తమిళనాడు ప్రజలు గందరగోళానికి గురి కావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆయన మీద మండిపడింది. డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ తో సహ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్చందంగా నీలవేంబు ఔషదాన్ని ప్రజలకు పంపిణి చేస్తున్నారు.