కావేరీ చిచ్చు: బెంగళూరు పరిస్థితిపై మోడీ స్పందన
న్యూఢిల్లీ: కావేరీ నదీ వివాదం అంశం పైన ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. చట్టాన్ని ఉల్లంఘించడం సరికాదని ఆయన అన్నారు. తమిళనాడు, కర్నాటకలలో హింస పైన ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జాతి ప్రయోజనాల కోసం శాంతియుతంగా ఉండాలన్నారు.
నీటి సమస్యలు కోర్టుల ద్వారా పరిష్కారం అవుతాయని చెప్పారు. రోడ్ల పైకి వచ్చి ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులకు నష్టం కలిగించడం వల్ల సస్య పరిష్కారం కాదని చెప్పారు. కావేరీ నీటి అంశం ఇరు రాష్ట్రాల మధ్య సున్నితమైన అంశమన్నారు. ప్రస్తుత పరిస్థితులు వ్యక్తిగతంగా తనను బాధించాయన్నారు.
అంతకుముందు, కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ఇంత జరుగుతుంటే ప్రధాని మోడీ పెదవి విప్పక పోవడం సరికాదన్నారు. కర్నాటకలోని తమిళులకు భద్రత కల్పిస్తున్నామని చెప్పారు.

కాగా, కావేరీ జలాల వివాదం సోమవారం కర్ణాటక, తమిళనాడుల్లో భారీ విధ్వంసానికి దారి తీసిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో ఆందోళనకారులు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. బెంగళూరు కెంగేరిలోని ద్వారకనాథ్ నగర వద్ద ఒకే ఆవరణలో నిలిపి ఉంచిన తమిళనాడు ప్రయివేటు రవాణా సంస్థ కేపీఎన్కు చెందిన 30, మరో సంస్థకు చెందిన 2 బస్సుల్ని దుండగులు తగులబెట్టారు. తొలుత 52 బస్సులుగా భావించినప్పటికీ.. 32 బస్సులు దగ్ధమయ్యాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 38 లారీలను ధ్వంసం చేశారు. సోమవారం రాత్రి బెంగళూరులో ఆందోళనకారులపై భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా ఇద్దరికి బుల్లెట్ గాయాలయ్యాయి. మరోవైపు తమిళనాడులో రాజధాని చెన్నైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్పై కర్ణాటక తీరుకు నిరసనగా ఆందోళనకారులు పెట్రోలు బాంబుతో దాడి చేశారు. రామేశ్వరం, ఆంబూర్లతోపాటు పలు ప్రాంతాల్లో కర్ణాటకకు చెందిన బస్సులు, పర్యాటక వాహనాలను ధ్వంసం చేశారు.












Click it and Unblock the Notifications