నీరవ్ మోడీ స్కామ్: పిఎన్బీ జనరల్ మేనేజర్ అరెస్టు
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ జనరల్ మేనేజర్ రాజేష్ జిందాల్ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) అరెస్టు చేసింది. 2009 ఆగస్టు నుంచి 2011 మే వరకు ఆయన అక్రమాలు జరిగిన పిఎన్బీ బ్రాడీ హౌస్ బ్రాంచ్ బాధ్యతలు చూశారు.
2011 నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ పలువురు అధికారులను సస్పెండ్ చేసింది. వారిలో రాజేష్ జిందాల్ కూడా ఉన్నారు. మరో జనరల్ మేనేజర్ అనిల్ బన్సాల్ను కూడా పిఎన్బీ సస్పెండ్ చేసింది. ఈయన 2015లో సర్కిల్ హెడ్గా ఉన్నారు. గోకుల్నాథ్ శెట్టి బదిలీ ఆదేశాలను ఆయన రద్ద చేశారు. దానివల్ల ఏడేళ్ల పాటు గోకుల్నాథ్ శెట్టి బ్రాడీ హౌస్ బ్రాంచ్లో కొనసాగాడు.
నీరవ్ మోడీకి, అతని కంపెనీలకు గోకుల్నాథ్ శెట్టి వందకు పైగా ఎల్ఓయులను జారీ చేశాడు. గోకుల్నాథ్ శెట్టిని సిబిఐ ఇదివరకే అరెస్టు చేసింది. నీరవ్ మోడీ ఆర్థిక వ్యవహారాలు చూస్తున్న ఉన్నతాధికారి విపుల్ అంబానీని సిబిఐ మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
నీరవ్ మోడీకి చెందిన డైమండ్ ఆర్ యుఎస్, స్టెల్లార్ డైమండ్, సోలార్ ఎక్స్పోర్ట్ కంపెనీలకు చెందిన విపుల్ అంబానీతో పాటు కవిత మంకీకర్, అర్జున్ పాటిల్లను కూడా సిబిఐ మంగళవారం అరెస్టు చేసింది.