సీబీఐ అదుపులో బాత్ రూంలో భోషాణం కింగ్
చిత్రదుర్గకు చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు చెందిన కే.సి. వీరేంద్రను సీబీఐ అధికారులు సోమవారం అరెస్టు చేశారు.
బెంగళూరు: చిత్రదుర్గకు చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు చెందిన కే.సి. వీరేంద్రను సీబీఐ అధికారులు సోమవారం అరెస్టు చేశారు. చిత్రదుర్గలోని చెళ్లకెరెలోని వీరేంద్ర ఇంటి బాత్ రూం గోడలో ఉన్న ప్రత్యేక గదిలోని పెట్టలో ఉన్న రూ. 5.7 కోట్ల విలువైన కొత్త నోట్లను ఇటీవల ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అంతే కాకుండా ఒక కోటి రూపాయల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు వీరేంద్రతో పాటు అతనికి కొత్త నోట్లు ఇచ్చిన బ్యాంకు అధికారులు, సిబ్బంది ఎవరూ ? అని ఆరా తీస్తున్నారు.
రూ. 5.7 కోట్ల విలువైన కొత్త రూ. 2,000 నోట్లు ఒకే వ్యక్తి తీసుకోవడం సాధ్యం అయ్యే పనేనా ? అని సీబీఐ అధికారులు అంటున్నారు. వీరేంద్రకు రాష్ట్ర వ్యాప్తంగా రిక్రియేషన్ క్లబ్బులు ఉన్నాయి. హవాలా వ్యాపారి సుమందర్ సింగ్ ఇతని స్నేహితుడు.
సుమందర్ సింగ్ క్రికెట్ బెట్టింగ్ దందా చేసేవాడని పోలీసులు ఇప్పటికే గుర్తించారు. సుమందర్ సింగ్ ఇంటి మీద ఐటీ అధికారులు దాడి చేశారు. వీరేంద్ర సోదరుడు తిప్పేస్వామి ఇంటి మీద దాడి చేసిన అధికారులు బంగారు నగలు, ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
వీరేంద్రను సీబీఐ అధికారులు అరెస్టు చేశారని సమాచారం తెలుసుకున్న కొందరు బ్యాంకు అధికారులు, సిబ్బంది మాయం అయ్యారు. వీరేంద్రకు కొత్త నోట్లు ఇచ్చిన బ్యాంకులను సీబీఐ అధికారులు గుర్తించి దాడి చెయ్యడానికి రంగం సిద్దం చేస్తున్నారు. ప్రముఖ కన్నడ నటుడు దోడ్డన్న అల్లుడు అయిన వీరేంద్ర వ్యాపారంతో పాటు ఓ రాజకీయ పార్టీలో చిత్రదుర్గ జిల్లా నాయకుడిగా పని చేస్తున్నాడు.