నారదా కుంభకోణం: సీబీఐ వలలో ఐపీఎస్ చేప: మరో వికెట్!
కోల్ కత: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో ఓ అనూహ్య మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి అరెస్ట్ అయ్యారు. ఆయన పేరు ఎస్ఎంహెచ్ మీర్జా. ప్రస్తుతం ఆయన పశ్చిమ బెంగాల్ లోని బుర్ద్వాన్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ గా పని చేస్తున్నారు. 2016లో నారదా కుంభకోణం కేసు దర్యాప్తులో తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత ముకుల్ రాయ్ తరఫున ఎస్ఎంహెచ్ మీర్జా ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనితో పాటు పెద్ద ఎత్తున లంచం తీసుకుని అసలు నిందితులను తప్పించడానికి ప్రయత్నించినట్లు కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు గురువారం ఆయనను అరెస్టు చేశారు.
మానవత్వం చూపిన మహిళా కానిస్టేబుల్: కేన్సర్ రోగుల కోసం ఏం దానం చేసిందంటే!
ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి ఈ కేసులో అరెస్టు కావడం ఇదే తొలిసారి. ఈ కేసులో సీబీఐ ముందడుగు వేయడం పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ను ఇరుకున పెట్టడం ఖాయమని తెలుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన పలువురు ఎంపీలు, మంత్రులపై వచ్చిన కోట్ల విలువైన ముడుపుల ఆరోపణలను బట్టబయలు చేసిన స్టింగ్ ఆపరేషన్ ఇది. నారదా న్యూస్ అనే ఓ వెబ్ సైట్ దీన్ని చేపట్టింది. ఓ డమ్మీ కంపెనీకి ప్రభుత్వ పరమైన అన్ని రకాల సహాయ, సహకారాలను అందజేయడానికి తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కొందరు మంత్రులు ప్రయత్నించారని తేలింది.
ఈ సందర్భంగా నారదా న్యూస్ ప్రతినిధులు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో ఈ తతంగం అంతా వెలుగు చూసింది. వారి బండారాన్ని బయట పెట్టింది. తృణమూల్ కాంగ్రెస్ నాయకులు కొందరు ముడుపులు తీసుకుంటున్న దృశ్యాలను నారదా న్యూస్ చిత్రీకరించింది. 2016లో ఈ ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు వ్యవహారం అటు ఇటు తిరిగి సీబీఐ చేతికి వెళ్లింది. దీనిపై ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని అప్పట్లో పశ్చిమ బెంగాల్ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ కేసులో అప్పట్లోనే మీర్జాపై ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఆయనతో పాటు టీఎంసీకి చెందిన సౌగతరాయ్, సువేందు అధికారి, సుల్తాన్ అహ్మద్, అపరూప పోద్దార్, కకోలి ఘోష్ దాస్తిదార్, ప్రషూన్ బెనర్జీ, మంత్రులు సుబ్రత ముఖర్జీ, ఫిర్హాద్, హకీం, మదన్ మిత్రపై ముడుపులు తీసుకున్న ఆరోపణలు వెలువడ్డాయి. ముకుల్రాయ్ తరఫున మీర్జా డబ్బు తీసుకున్నట్టు వీడియోలో రికార్డయింది. ఆరోపణలు వచ్చిన ఐపీఎస్ అధికారి మీర్జాపై క్రమశిక్షణాచర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పట్లోనే న్యాయస్థానం ఆదేశించింది. దీనిపై సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని మమతాబెనర్జీ వ్యాఖ్యానించారు.