లంచం: సిండికేట్ బ్యాంక్ సిఎండి సుధీర్ జైన్ అరెస్ట్
న్యూఢిల్లీ: సిండికేట్ బ్యాంక్ సిఎండి సుధీర్ కుమార్ జైన్ను శనివారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) శనివారం అరెస్ట్ చేసింది. రూ. 50 లక్షలు లంచం తీసుకున్నట్లు రుజువు కావడంతో ఆయనను అదుపులోకి తీసుకుంది.
పలు కంపెనీలకు రుణాలు ఇచ్చేందుకు సుధీర్ జైన్ ఆయా కంపెనీల నుంచి లంచాలు తీసుకున్నట్లు సిబిఐ అధికారులు పేర్కొన్నారు. ఏక కాలంలో తాము ఢిల్లీ, బెంగళూరు, భోపాల్, ముంబైలలో సోదాలు నిర్వహించినట్లు సిబిఐ అధికారులు తెలిపారు.
ఆయన లంచంగా తీసుకున్న రూ. 50 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలు, నేరానికి సంబంధించిన డాక్యుమెంట్ల కోసం తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
సుబ్రతా రాయ్కి స్వల్ప ఊరట
సహారా చీఫ్ సుబ్రతా రాయ్కి స్వల్ప ఊరట లభించింది. లండన్, న్యూయార్క్లలో ఉన్న మూడు లగ్జరీ హోటళ్ల అమ్మకానికి సంబంధించి కొనుగోలుదారులతో అవసరమైన చర్చలు జరిపేందుకు ఆగస్ట్ 5 నుంచి 10 రోజులపాటు తీహార్ జైలు ఆవరణలోని కాన్ఫరెన్స్ గదిని వాడుకోవచ్చంటూ సుప్రీం కోర్టు శుక్రవారం అనుమతిచ్చింది. ఈ పది రోజులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రాయ్ చర్చలు జరపవచ్చు. ఇంతకుమించి ఎక్కువసేపు చర్చలు జరగరాదని కూడా సుప్రీం స్పష్టం చేసింది.