బొగ్గు కుంభకోణం: మన్మోహన్ను విచారించిన సిబిఐ?
న్యూఢిల్లీ: యుపిఏ ప్రభుత్వ హయాంలో జరిగిన బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను సిబిఐ ప్రశ్నించినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే, ఈ విషయాన్ని ధ్రువీకరించడానికి ఇటు సీబీఐగానీ, అటు మన్మోహన్గానీ ఇష్టపడటం లేదు.
ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లాకు చెందిన హిందాల్కో సంస్థకు ఒడిశాలోని తాలాబిరా బొగ్గు బ్లాక్-2 కేటాయింపు విషయంలో రెండురోజుల కిందట మన్మోహన్ను ఆయన నివాసంలో సీబీఐ అధికారుల బృందం విచారించిందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. జనవరి 27న ఈ కేసుకు సంబంధించిన ప్రగతి నివేదికను సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేయనున్న నేపథ్యంలో ఆయనను ప్రశ్నించినట్టు చెప్పాయి.
సీబీఐ అధికార ప్రతినిధి కంచన్ప్రసాద్ ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. నిరాకరించనూలేదు. మరోవైపు మన్మోహన్ అనుచరుడొకరు ఈ వార్తలను తోసిపుచ్చారు. 2005లో బొగ్గు మంత్రిత్వశాఖ అప్పటి ప్రధాని మన్మోహన్ వద్ద ఉన్న సమయంలో హిందాల్కోకు తాలాబిరా బ్లాక్ను కేటాయించారు.
2005 మే 7, జూన్ 17న ఈ బ్లాక్ను హిందాల్కోకు కేటాయించాల్సిందిగా ప్రధానిని కోరుతూ కుమార మంగళం బిర్లా రెండు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో హిందాల్కోకు బొగ్గు గని కేటాయించే సమయంలో బొగ్గు మంత్రిత్వశాఖ, ప్రధాని కార్యాలయంలో ఏమేం పరిణామాలు జరిగాయో తెలుసుకునేందుకు మన్మోహన్ను సీబీఐ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది.