జీవీకే గ్రూప్ కు భారీ షాక్ - కృష్ణారెడ్డి, కుమారుడిపై సీబీఐ కేసు -ముంబై ఎయిర్ పోర్టు పనుల్లో అవినీతి
దేశంలో విద్యుత్, నిర్మాణ రంగంతో పాటు పలు కీలక రంగాల్లో సేవలందిస్తున్న జీవీకే గ్రూప్ కు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ముంబై ఎయిర్ పోర్టు అభివృద్ధి పనుల్లో అవినీతికి సంబంధించి సీబీఐ జీవీకే అధినేత కృష్ణారెడ్డితో పాటు ఆయన కుమారుడు సంజయ్ రెడ్డిపైనా కేసు నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు కీలక రంగాల్లో పేరు ప్రతిష్టలున్న కృష్ణారెడ్డి కుటుంబంపై కేసు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది.
రజనీకాంత్ v/s విజయ్ ఫ్యాన్, విరాళాలపై గొడవ, డిష్యూం.. డిష్యూం, ప్రాణం తీసిన అభిమానం
ముంబై ఎయిర్ పోర్టు అభివృద్ధి...
ముంబై ఎయిర్ పోర్టు అభివృద్ధి కోసం 2006లో ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, జీవీకే ఎయిర్ పోర్ట్స్ హోల్డింగ్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ జాయింట్ వెంచర్ ప్రకారం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణ కోసం వీరు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య సంస్ధ మియాల్ తో ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో 2017-18లో 9 కంపెనీలకు బోగస్ వర్క్ కాంట్రాక్టులు ఇచ్చినట్లు చూపించి రూ.310 కోట్లను వీరు దారి మళ్లించినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఇందులో పాత్రధారులుగా ఉన్న జీవీకే గ్రూప్ అధినేత కృష్ణారెడ్డి, ఆయన తనయుడు సంజయ్ రెడ్డిలతో పాటు మరికొందరిపై సీబీఐ అవినీతి కేసు నమోదు చేసింది.
గ్రూప్ కంపెనీల కోసమే...
జీవీకే గ్రూప్ లోని ఇతర సంస్ధలకు ఆర్ధిక సాయం చేసే పేరుతో మరో రూ. 395 కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసినట్లు సీబీఐ ఈ కేసులో గుర్తించింది. ప్రస్తుతం జీవీకే కృష్ణారెడ్డి గ్రూప్ ఛైర్మన్ గా ఉండగా.. ఆయన కుమారుడు సంజయ్ రెడ్డి జీవీకే ఎయిర్ పోర్ట్స్ హోల్డింగ్స్ ఎండీగా ఉన్నారు. వీరిద్దరు ప్రమోటర్లుగా ఉన్న గ్రూప్ లోని ఇతర కంపెనీల కోసమే ఈ మొత్తాన్ని దారి మళ్లించినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ఇందులో మరో 9 సంస్ధలతో పాటు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలోని పలువురు ఉద్యోగుల పాత్ర కూడా ఉన్నట్లు సీబీఐ నిర్ధారించింది. వీరందరినీ త్వరలో అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Recommended Video
మొత్తం రూ.705 కోట్ల అవినీతి...
ముంబై ఎయిర్ పోర్టు అభివృద్ది కాంట్రాక్టు దక్కించుకున్న జీవీకే గ్రూప్ కు చెందిన ఎయిర్ పోర్ట్స్ హోల్డింగ్స్ కు అందులో 38.07 శాతం వాటా ఉంది. అలాగే ఎయిర్ పోర్ట్ ఆథారిటీకి 26 శాతం వాటా ఉంది. 2012 నుంచి ఎయిర్ పోర్టు అభివృద్ధికి వెచ్చించాల్సిన రూ.395 కోట్ల రిజర్వు ఫండ్స్ ను తన గ్రూప్ కంపెనీలకు జీవీకే అధినేత, ఆయన కుమారుడు మళ్లించినట్లు సీబీఐ తమ ఎఫ్ఐఆర్ లో ఆరోపించింది. తద్వారా బోగస్ కాంట్రాక్టుల ద్వారా కూడబెట్టిన రూ.310 కోట్లు, రూ.395 కోట్ల దారి మళ్లింపు మొత్తం కలిపి రూ.705 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు కేసులు నమోదు చేసింది.