రఘురామ కృష్ణరాజుపై ఎఫ్ఐఆర్, రంగంలోకి సీబీఐ.. కారణమిదేనా
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు నిత్యం వార్తల్లో ఉంటారు. అధికార వైసీపీ, సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తుంటారు. విజయసాయిరెడ్డి, ఇతర ముఖ్య నేతలను కూడా వదలరు. అయితే ఆయనపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీంతో కలకలం నెలకొంది. రఘురామ.. బీజేపీకి అనుకూలంగా ఉన్న కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగడంతో అనుమానాలు వస్తున్నాయి.
ఎస్బీఐ చెన్నై బ్రాంచ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ రవిచంద్రన్.. రఘురామపై ఫిర్యాదు చేశారు. ఇంద్ భారత్ పవర్ ప్రాజెక్ట్ కోసం రఘురామకృష్ణంరాజు 273.84 కోట్లు రుణం తీసుకుని ఎగవేశారని కంప్లైంట్ ఇచ్చారు. దీంతో సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. తొలుత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో బ్యాంకును మోసం చేసి, నిధులను దారి మళ్లించారని మేనేజర్ రవిచంద్రన్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీనికి సంబంధించి ఈ నెల 23న ఫిర్యాదు చేశారు. రఘురామకృష్ణరాజు సహా మరో 9 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. తప్పుచేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సీబీఐ అధికారులు తెలిపారు. రఘురామ.. పేరుకు వైసీపీ ఎంపీ అయినా.. ఆయన బీజేపీకి అనుకూలంగా ఉంటున్నారు. కమల దళ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. అయితే మధ్యలోనే ఆగిపోయింది.