సీబీఐలో బదలీలు, వివాదంపై అరుణ్ జైట్లీ వివరణ: 'కొత్త చీఫ్ నాగేశ్వర రావు కూడా అవినీతిపరుడే'
న్యూఢిల్లీ: సీబీఐలో రాత్రికి రాత్రి ఇద్దరు అధికారులను సెలవులపై పంపడం, ఆ తర్వాత నాగేశ్వర రావును తాత్కాలిక చీఫ్గా నియమించడం దుమారం రేపుతోంది. అధికారులు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో వారిని తొలగించడాన్ని పలువురు అధికారులు, మాజీ అధికారులు సమర్థిస్తున్నారు. విపక్షాలు మాత్రం దీనిని టార్గెట్ చేస్తున్నాయి.
సుప్రీంకోర్టుకు సీబీఐ వివాదం, నాగేశ్వరరావు నియామకం పైనా: జేపీ, లక్ష్మీనారాయణ ఏమన్నారంటే?
మరోవైపు, రాకేష్ ఆస్థానా కేసును దర్యాఫ్తు చేస్తున్న పలువురు సీబీఐ అధికారులను కొత్త టీమ్ బదలీ చేసింది. సీబీఐలోని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అధికారినీ బదలీ చేశారు. సీబీఐ డీఐజీ మనీష్ కుమార్ సిన్హా, డీఐజీ తరుణ్ గౌబా, డీఐజీ జస్బీర్ సింగ్, డీఐజీ అనీష్ ప్రసాద్, డీఐజీ కేఆర్ చౌరాసియా, హెచ్ఓబీ రామ్ గోపాల్, ఎస్పీ సతీష్ దగార్ తదితరులను ట్రాన్సుఫర్ చేశారు.
అందుకే బదలీలు అని ఆరోపణ
రాకేష్ ఆస్థానా పైన వచ్చిన ఆరోపణలపై విచారించేందుకు ముగ్గురు అధికారులను కొత్త సీబీఐ టీమ్ నియమించింది. సీబీఐ జేడీ (పీ) అరుణ్ కుమార్ శర్మ, సాయి మనోహర్, హెఓజెడ్ మురుగేషన్లతో పాటు డీఐజీ అమిత్ కుమార్లను కూడా ట్రాన్సుఫర్ చేసింది. వీరు రాకేష్ ఆస్థానా కేసును దర్యాఫ్తు చేస్తారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. సీబీఐ అంటే బీజేపీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్గా మారిందని ఆరోపించారు. అధికారుల బదలీపై సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరీ మండిపడ్డారు. తమ అధికారులను కాపాడుకునేందుకే ఈ బదలీలు అని ఏచూరీ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ సీబీఐ వ్యవస్థను నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు.
విచారణ పారదర్శకంగా ఉండేందుకే
తాము సీబీఐ ప్రతిష్టను కాపాడుతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం చెప్పారు. సీబీఐ చీఫ్ అలోక్ వర్మ సహా ఇద్దరిని సెలవులపై పంపించడంపై కాంగ్రెస్ సహా విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇరువురు అధికారులు పరస్పర ఆరోపణలు చేసుకున్నందున విచారణలో తేలేవరకు వారిద్దరిని తప్పించాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అదే చేసింది. కానీ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో జైట్లీ స్పందించారు. అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానాలు పర్సపరం ఆరోపణలు చేసుకున్నారని చెప్పారు. కాబట్టి ఇద్దరిలో ఎవరిది తప్పో విచారణలో తేలుతుందని తెలిపారు. పారదర్శకంగా విచారణ జరిపిస్తున్నామని చెప్పారు. తాము సీబీఐ ప్రతిష్టను కాపాడుతున్నామన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మూడు ప్రతిపక్ష పార్టీలు దీనిని విమర్శిస్తున్నాయని జైట్లీ మండిపడ్డారు. వారి ఆరోపణలు ఏమాత్రం సరికాదన్నారు.
సీవీసీ నిర్ణయం మేరకు
సీబీఐ ఒక ప్రధాన దర్యాప్తు సంస్థ అని, ఇప్పుడు దాని సమగ్రత, విశ్వసనీయతను కాపాడటం ఎంతో అవసరమని, అందుకోసం ఇద్దరు సీబీఐ అధికారులపై ఉన్న కేసులను పారదర్శకంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని జైట్లీ చెప్పారు. సీబీఐ డైరెక్టర్ను నిందితుడిగా ప్రత్యేక డైరెక్టర్ చెబుతున్నారని, ప్రత్యేక డైరెక్టర్ను నిందితుడిగా సీబీఐ పేర్కొందని, సీబీఐలోని ఇద్దరు ఉన్నతాధికారులు ఇప్పుడు నిందితులే అన్నారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం చాలా దురదృష్టకరమైన పరిస్థితి అన్నారు. సీబీఐ సమగ్రతను కాపాడటం కోసం న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అందులో భాగంగానే వాళ్లను సెలవుపై పంపించామన్నారు. వారిద్దరిపై ఉన్న కేసులను సిట్ బృందం విచారిస్తోంది. ఈ విషయంపై చర్చించేందుకు సీవీసీ నిన్న అత్యవసరంగా సమావేశమైందన్నారు. ఇద్దరు సీబీఐ అధికారులపై వస్తోన్న ఆరోపణలను ఏ ఏజెన్సీ అయినా విచారణ చేయవచ్చని సీవీసీ వెల్లడించిందన్నారు. అందువల్లే అలోక్ వర్మ, ఆస్థానాను సెలవుపై పంపిస్తున్నామన్నారు. ఇది తాత్కాలికంగా తీసుకున్న నిర్ణయం మాత్రమేనని చెప్పారు. సీవీసీ ప్రతిపాదన మేరకే ప్రభుత్వం సీబీఐ అధికారులపై ఈ చర్య తీసుకుందన్నారు.
నాగేశ్వర రావు సచ్ఛీలుడేం కాదు
ఇదిలా ఉండగా సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా నియమితులైన నాగేశ్వర రావు పైన సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన సచ్చీలుడేమీ కాదన్నారు. నాగేశ్వర రావు పైన కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. ఆయన నియామకం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.