మమత బెనర్జీ చుట్టూ మోదీ-సీబీఐ ఉచ్చు: దీదీ రైట్ హ్యాండ్ నివాసంపై మెరుపు దాడులు
కోల్కత: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం- తన రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను అధికారులను ప్రయోగిస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తిన వేళ.. పశ్చిమ బెంగాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ను మరోసారి టార్గెట్గా చేసుకుంది. మొన్నటికి మొన్న ఆమె సహచర మంత్రి పార్థ ఛటర్జీ నివాసంపై ఈడీ అధికారులు దాడులు చేశారు. 20 కోట్ల రూపాయల నల్లధనాన్ని వెలికి తీశారు.
ఈ కేసులో పార్థ ఛటర్జీ సమీప బంధువు అర్పిత ఛటర్జీనీ అరెస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా మరో మంత్రి సీబీఐ టార్గెట్లోకి వచ్చారు. న్యాయశాఖ మంత్రి మొలొయ్ ఘటక్పై నివాసం సీబీఐ మెరుపుదాడులు చేసింది. తన కుటుంబ సభ్యులతో కలిసి అసన్సోల్లో ఉంటోన్నారు మొలొయ్ ఘటక్. కోల్కత నుంచి ఆరు బృందాలతో కూడిన సీబీఐ అధికారులు ఈ తెల్లవారు జామునే అసన్సోల్ చేరుకున్నారు.
ఆయన ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. ఇంటి చుట్టూ కేంద్రీయ రిజర్వ్ పోలీస్ బలగాలను మోహరింపజేశారు. బయటి వ్యక్తులనెవరినీ లోనికి రానివ్వలేదు. మొలొయ్ కుటుంబ సభ్యులు, సిబ్బందినీ బయటికి వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదు. ఆయన కార్యాలయాలపైనా ఏకకాలంలో ఈ దాడులు సాగిస్తోన్నారు. పశ్చిమ బెంగాల్లో బొగ్గు కుంభకోణానికి మొలొయ్ ఘటక్ పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు.
ప్రభుత్వంలో.. పార్టీలో మొలొయ్ ఘటక్ కీలక నాయకుడు. మమత బెనర్జీకి రైట్ హ్యాండ్గా ఆయనకు పేరుంది. 2020లో ఈస్టర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్లో బొగ్గు గనుల కేటాయాంపుల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు మొలొయ్ ఘటక్పై ఫిర్యాదులు అందాయి. అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సీబీఐ అధికారులు. విచారణకు హాజరు కావాలంటూ పలుమార్లు సమన్లను జారీ చేసినప్పటికీ.. ఆయన వెళ్లలేదు. ఈ కుంభకోణంలో ఇప్పటివరకు టీఎంసీ యువజన విభాగం నాయకుడు వినయ్ మిశ్రా అరెస్ట్ అయ్యారు.