అక్రమ మైనింగ్: సీబీఐ కస్టడీకి ఎంఎల్ఏ అనీల్
బెంగళూరు: అక్రమ మైనింగ్, అక్రమంగా విదేశాలకు ఇనుప ఖనిజం తరలించారని ఆరోపిస్తూ కర్ణాటకలోని బళ్లారి నగర కాంగ్రెస్ శాసన సభ్యుడు, ప్రముఖ వ్యాపారవేత్త అనీల్ లాడ్ ను సీబీఐ అధికారులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
అనీల్ లాడ్ ప్రముఖ మైనింగ్ వ్యాపారి. బళ్లారి నగరం నుండి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ తో పోటి చేసి శాసన సభ్యుడిగా గెలుపొందారు. ఆయన అక్రమ మైనింగ్ నిర్వహించాడని, అక్రమంగా ఇనుప ఖనిజం విదేశాలకు తరలించారని సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.
విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం బెంగళూరు నగరంలోని సీబీఐ కార్యాలయంలో అనీల్ లాడ్ హాజరైనాడు. అనీల్ లాడ్ ను విచారణ చేసిన సీబీఐ అధికారులు రాత్రి అరెస్టు చేశామని చెప్పారు.
గురువారం సిటి సివిల్ కోర్టు ఆవరణంలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో అనీల్ లాడ్ ను హాజరు పరిచారు. విచారణ చెయ్యడానికి తమ కస్టడికి ఇవ్వాలని సీబీఐ అధికారులు మనవి చేశారు. కేసు వివరాలు తెలుసుకున్న సీబీఐ కోర్టు న్యాయమూర్తి హెచ్.కే. మల్లప్ప ఈ నెల 20వ తేది వరకు విచారణ చెయ్యడానికి అంగీకరించారు.
సీబీఐ అధికారులు అనీల్ లాడ్ ను కస్టడికి తీసుకున్నారు. ఇదే సమయంలో తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని అనీల్ లాడ్ అర్జీ సమర్పించారు. ఈ నెల 20వ తేదికి విచారణ వాయిదా వేశారు. శాసన సభ్యుడిని విధాన సౌధ బయట అరెస్టు చెయ్యడానికి తన అనుమతి అవసరం లేదని స్పీకర్ కాగోడు తిమ్మప్ప స్పష్టం చేశారు.