జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కు సీబీఐ సమన్లు-పుల్వామా వ్యాఖ్యల నేపథ్యం ?
జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కు సీబీఐ ఇవాళ సమన్లు జారీ చేసింది. పుల్వామా దాడుల విషయంలో కేంద్రం తీరుపై తాజాగా విమర్శలు చేసిన సత్యపాల్ మాలిక్ కు సీబీఐ మరో కేసులో విచారణకు రావాలని సమన్లు పంపింది. జమ్మూ కశ్మీర్ గవర్నర్ గా పనిచేసిన సమయంలో అనిల్ అంబానీ ఇన్సూరెన్స్ సంస్ధ కాంట్రాక్టు రద్దు చేసిన వ్యవహారంపై ఆయనకు సమన్లు పంపారు.
2018లో జమ్మూ కశ్మీర్ గవర్నర్ గా పనిచేసిన సమయంలో సత్యపాల్ మాలిక్ అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్ధ కాంట్రాక్టును రద్దు చేశారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో మాలిక్ అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. మాలిక్ ను సాక్షిగా విచారణకు రావాలని నోటీసులు పంపింది. దీంతో ఆయన విచారణకు హాజరు కావాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది.

జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలకు మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ను రూపొందించడంలో చోటు చేసుకున్న కుంభకోణంలో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్తో పాటు ట్రినిటీ రీఇన్స్యూరెన్స్ బ్రోకర్స్ను సీబీఐ నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. బీమా పథకంలో అవకతవకలు జరిగాయని మాలిక్ అప్పట్లో ఆరోపించగా.. ఆ తర్వాత సీబీఐ చర్య తీసుకుంది. ఈ స్కాం గురించి మాలిక్ నుంచి మరింత సమాచారం రాబట్టాలని భావిస్తున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి.
మరోవైపు తాజాగా పుల్వామా దాడి గురించి సత్యపాల్ మాలిక్ సంచలన విషయాలు వెల్లడించారు. సిఆర్పిఎఫ్ బలగాలు తమ ప్రజలను తీసుకెళ్లడానికి విమానాలను అడిగారని, ఎందుకంటే ఇంత పెద్ద కాన్వాయ్ సాధారణంగా రోడ్డు మార్గంలో ప్రయాణించదని మాలిక్ తెలిపారు. హోం మంత్రిత్వ శాఖకు వారు చేసిన అభ్యర్థన ను వారు తోసిపుచ్చారన్నారు. అదే రోజు సాయంత్రం తాను ప్రధానమంత్రికి ఈ విషయం చెప్పానని, మన తప్పు వల్లనే ఇలా జరిగిందని చెప్పానన్నారు. విమానం సమకూర్చి ఉంటే ఇలా జరిగేది కాదన్నారు. దానికి మోడీ మౌనంగా ఉండమని చెప్పారన్నారు.












Click it and Unblock the Notifications