విద్యార్థుల వీపు విమానం మోతే: సీబీఎస్ఈ పరీక్ష ఫీజుల వాత! రూ.50 నుంచి రూ.1200కు పెంపు
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్టు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరీక్ష ఫీజుల ఫీజును అసాధారణంగా పెంచేసింది. విద్యార్థుల వీపు విమానం మోత మోగించింది. ఇదివరకు ఉన్న ఫీజుల మొత్తాన్ని 24 రెట్లు పెంచింది. ఫలితంగా- ప్రస్తుతం 50 రూపాయలుగా ఉన్న ఫీజు మొత్తం తాజా పెంపుతో 1200 రూపాయలకు చేరింది. 10, 12వ తరగతి బోర్డు పరీక్షలు రాసే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు తాజా పెంపు వర్తిస్తుంది. అవే తరగతుల్లో చదివే సాధారణ కేటగిరి విద్యార్థుల విద్యార్థుల ఫీజును కూడా పెంచినప్పటికీ.. ఆ స్థాయిలో లేదు. సాధారణ కేటగిరీ విద్యార్థుల పరీక్ష ఫీజు 750 నుంచి 1500 రూపాయలకు పెంచారు.
దీనితో పాటు వారి ఫీజుల చెల్లింపులపై కొత్తగా ఆంక్షలను విధించారు. 10వ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులు తత్సంబంధిత పరీక్షా ఫీజును తొమ్మిదో తరగతిలోనే చెల్లించాల్సి ఉంటుంది. తన పేరును రిజిస్ట్రర్ చేయించుకోవాల్సి ఉంటుందని సీబీఎస్ఈ ఆదేశాలు జారీ చేసింది.
అలాగే- ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను రాయబోయే విద్యార్థులు తమ పేరును మొదటి సంవత్సరంలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పాత ఫీజులకు అనుగుణంగా విద్యార్థుల రిజిస్ట్రేషన్లను ప్రారంభించిన విద్యాసంస్థలు తాజాగా మిగిలిన మొత్తాన్ని విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవాలని సూచించింది.