సీబీఎస్ఈ గుడ్న్యూస్: 1-8 పరీక్షలు లేకుండానే ప్రమోట్, 10, 12 కీలక సబ్జెక్టులకు మాత్రమే..
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) తుది పరీక్షలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే, పరీక్షల నిర్వహణపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళనలను తొలగిస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం ప్రకటించింది.
1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేయాలని సీబీఎస్ఈని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆదేశించింది. 9 నుంచి 11వ తరగతుల విద్యార్థులను అంతర్గతంగా పాఠశాలలో నిర్వహించిన ప్రాజెక్టులు, పరీక్షల మార్కుల ఆధారంగా తర్వాతి తరగతులకు ప్రమోట్ చేయాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తన ట్విట్టర్లో వెల్లడించారు.

ఇప్పుడు పై తరగతులకు ప్రమోట్ కాని విద్యార్థులు తర్వాత పాఠశాలలో నిర్వహించే ఆన్లైన్, ఆఫ్లైన్ పరీక్షలకు హాజరుకావచ్చని స్పష్టం చేశారు. 10, 12 తరగతుల విద్యార్థులకు పై తరగతులకు వెళ్లేందుకు ఉన్నతస్థాయి విద్యాసంస్థల్లో చేరేందుకు అవసరమైన 29 సబ్జెక్టుల్లో మాత్రం బోర్డు పరీక్షలు నిర్వహిస్తుందని తెలిపారు.
పరిస్థితులను బట్టి ఈ పరీక్షల నిర్వహణ తేదీలను ముందుగా ప్రకటిస్తామని వెల్లడించారు.
ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా లాక్ డౌన్ కారణంగా 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేస్తున్నట్లు ఆయా రాష్ట్రాలప్రభుత్వాలు ప్రకటించాయి. పది పరీక్షలను వాయిదా వేశాయి. ఏప్రిల్ 14 వరకు కూడా లాక్ డౌన్ కొనసాగనున్న విషయం తెలిసిందే. దేశంలో కరోనా కారణంగా 41 మంది మరణించగా, సుమారు 1700 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications