ఉడిపి స్వామీజీ అనుమానాస్పదమృతి, మఠంలో సీసీ కెమెరాల డీవీఆర్ మాయం, రమ్యా!
బెంగళూరు: ఉడిపిలోని శిరూరు మఠం శ్రీ లక్ష్మివర తీర్థ స్వామీజీ అనుమానాస్పదమృతి కేసు దర్యాప్తు వేగవంతం అయ్యింది. విష ప్రయోగం జరగడం వలనే శ్రీ లక్ష్మివర తీర్థ స్వామీజీ మరణించారని మణిపాల వైద్యులు ఇప్పటికే మీడియాకు, పోలీసులకు చెప్పారు.
అపరచితుడు
శ్రీ లక్ష్మివర తీర్థ స్వామీజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో శిరూరు మఠంలోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మఠం సిబ్బంది స్వామీజీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న సమయంలో ఆ గుర్తు తెలియని వ్యక్తి లోపలికి ప్రవేశించాడని, అతని గురించి వారు పెద్దగా పట్టించుకోలేదని సమాచారం.
డీవీఆర్ మాయం
శిరూరు మఠంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల డీవీఆర్ ను ఎత్తుకుని ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారైన విషయం పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. డీవీఆర్ ఎందుకు చోరీ చేశారు ? అనే విషయంపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.
డీవీఆర్ లో రహస్యం
డీవీఆర్ పోలీసులకు చిక్కి ఉంటే శ్రీ లక్ష్మివర తీర్థ స్వామీజీ అనుమానాస్పదమృతి కేసు విషయంలో పోలీసులకు కొన్ని వాస్తవాలు తెలిసే అవకాశం ఉండేదని, అన్ని రహస్యాలు బయటకు వచ్చే అస్కారం ఉండేదని మఠం సిబ్బంది అంటున్నారు. అయితే గుర్తు తెలియని వ్యక్తి డీవీఆర్ మాయం చెయ్యడంతో పోలీసులకు పెద్ద తలనొప్పి ఎదురైయ్యింది.
రమ్యా శెట్టి, వంట మనిషి
ఇప్పటికే బ్రహావర ప్రాంతానికి చెందిన రమ్యా శెట్టిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు, మఠంలోని వంట మనిషిని సైతం పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరించారు. శ్రీ లక్ష్మివర తీర్థ స్వామీజీకి, రమ్యా శెట్టి మద్య ఎలాంటి సంబంధం ఉంది అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు.