శివసేన ఎవరిదో తేల్చేందుకు రంగంలోకి ఈసీ-షిండే, ఉద్ధవ్ వర్గాలకు ఆగస్టు 8 డెడ్ లైన్
ఏక్ నాథ్ షిండే అసమ్మతి రాజకీయాలతో మహారాష్ట్రలో అధికారం కోల్పోయిన శివసేనాని ఉద్ధవ్ థాక్రేకు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. శివసేనలో షిండే వర్గం వేర్పాటు రాజకీయాలతో ఏకాకిగా మారిన ఉద్ధవ్ థాక్రేకు తాజాగా ఎన్నికల సంఘం కూడా షాకిచ్చింది. శివసేనపై పట్టు నిరూపించుకోవాలని షిండే, ఉద్ధవ్ థాక్రే వర్గాలకు డెడ్ లైన్ విధించింది.
శివసేనలో ఇప్పటికే మూడోవంతు ఎమ్మెల్యేలు షిండే వర్గం వైపు ఫిరాయించారు. అలాగే ఎంపీలు కూడా అదే బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏక్ నాథ్ షిండే వర్గం శివసేన తమదే అంటోంది. ఈ నేపథ్యంలో బాల్ థాక్రే వారసుడిగా శివసేనను కాపాడుకోవడం ఇప్పుడు ఉద్ధవ్ కు కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే షిండే వర్గంపై న్యాయపోరాటం చేస్తున్న ఉద్ధవ్.. ఇప్పుడు ఈసీ ఇచ్చిన డెడ్ లైన్ తో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

శివసేనపై పట్టు నిరూపించుకోవడంలో ఆయన విఫలమైతే మాత్రం భవిష్యత్తులో మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. ఈ నేపథ్యంలో ఆగస్టు 8లోగా శివసేనపై పట్టు నిరూపించుకోవాలని ఈసీ విధించిన డెడ్ లైన్ షిండే కంటే ఉద్ధవ్ కే ప్రమాదఘంటికలు మోగిస్తోంది.
ఆగస్టు 8 మధ్యాహ్నం ఒంటిగంటలోగా శివసేనలో ఉన్న ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ నేతల సంతకాలతో కూడిన పత్రాల్ని తమకు సమర్పించాలని ఎన్నికల సంఘం.. ఏక్ నాథ్ షిండేతో పాటు ఉద్ధవ్ థాక్రేకూ సమాచారం పంపింది. ఇప్పటికే ఏక్ నాథ్ షిండే వర్గం శివసేనలో తమకు మద్దతిస్తున్న ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ ఆఫీసు బేరర్ల వివరాలతో ఈసీకి లేఖ సమర్పించింది. ఇందులో తమనే అసలైన శివసేనగా గుర్తించాలని కోరింది. దీంతో ఇప్పుడు ఉద్ధవ్ కూడా తన బలాన్ని చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ అదంత సులువుగా కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications