వామ్మో.. పాఠం చెప్తుండగా ఊడిపడిన ఫ్యాన్.. విద్యార్థికి గాయాలు.. ఎక్కడో తెలుసా..?
న్యూఢిల్లీ : వారిది కడు పేదరికం. అయినా దేశ రాజధానిలో పొట్ట పోసుకుంటున్నారు. నెలకు రూ.9 వేల జీతంతో కుటుంబాన్ని వెళ్లదీస్తున్నారు. అయితే ఆ కుటుంబంలోని చిన్నారికి క్యాన్సర్ రక్కసి సోకింది. ఎలాగోలా కుటుంబాన్ని పోషించుకొని వస్తున్నారు. రెక్కలు ముక్కలు చేసుకొని పిల్లాడిని చదివిస్తున్నారు. కానీ విధి ఆ కుటుంబంపై పగ పట్టినట్టుంది. తరగతి గదిలో పాఠం చెప్తుండగా అందరూ వింటున్నారు. ఆ విద్యార్థి కూడా శ్రద్ధగా ఆలకిస్తున్నాడు. పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ ఒక్కసారిగా కిందపడిపోయింది. దీంతో ఆ విద్యార్థికి రక్తస్రావం అవడంతో ఆస్పత్రికి తరలించారు.

ఒక్కసారిగా ..
ఢిల్లీలోని త్రిలోక్ పురిలో సర్వోదయ బాల్ విద్యాలయ పాఠశాల ఉంది. 13 ఏళ్ల హర్ష్ ఏడో తరగతి చదువుతున్నాడు. హర్ష్ కుటుంబం కడు పేదరికం .. రెక్కాడితే కానీ డొక్కడని పరిస్థితి. ఎప్పటిలాగే నిన్న కూడా అందరూ పాఠశాలకు వచ్చారు. తరగతి గదిలో టీచర్ ఫయాజ్ అహ్మద్ లెస్సన్ చెప్తున్నారు. అందరితోపాటు హర్ష్ శ్రద్ధగా వింటున్నాడు. అయితే ఒక్కసారిగా సీలింగ్ ఫ్యాన్ ఊడి పడిపోయింది. హర్ష్ తలపై పడి .. అతని తలపై కోసుకుపోయింది. వెంటనే అతని సమీపంలో ఆస్పత్రికి తరలించారు. పక్కనే ఉన్న మిగతా విద్యార్థులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. మరోవైపు స్కూల్ యాజమాన్యం గతంలో ఇలాంటి ఘటన ఎన్నడూ చోటుచేసుకోలేదని పేర్కొన్నారు.

నిర్లక్ష్యం ...
హర్ష్ తలకు బలమైన గాయం జరిగితే కేవలం ఇద్దరు సిబ్బందితో ఆస్పత్రికి పంపించారని అతని అంకుల్ పేర్కొన్నారు. ప్రిన్సిపల్ కాదు టీచర్ కూడా లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. తొలుత లాల్ బహదారు శాస్త్రి ఆస్పత్రికి తరలింంచారని .. కానీ అతని పరిస్థితి సీరియస్గా ఉండటంతో గురు తేజ్ బహదూర్ హాస్పిటల్కు తరలించారని పేర్కొన్నారు. అయితే హర్ష్ వైద్యానికి అయ్యే ఖర్చులు కూడా భరించే స్థితిలో వారి కుటుంబం లేదని పేర్కొన్నారు. కానీ సిటీ స్కాన్ చేయించామని .. హర్ష్ సృహలోకి వచ్చాడని తెలిపారు. అయితే పాఠశాలలో పరిస్థితి ఎలా ఉందో తాము చూడలేదని పేర్కొన్నారు. హర్ష్పై ఫ్యాన్ పడ్డాక అతని కుటుంబాన్ని ప్రిన్సిపల్, ఇతర సిబ్బంది కలువకపోవడం ఏంటని ప్రశ్నించారు. హర్ష్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదేం తీరు ...
పాఠశాలలో ఫ్యాన్ ఊడి పడటంతో హర్ష్ ఆస్పత్రిలో ఉంటే .. ఢిల్లీలో ఆప్, బీజేపీ మాత్రం విమర్శలకు ప్రాధాన్యం ఇచ్చాయి. ఇటీవల ఢిల్లీలో ఆప్ సర్కార్ చేపట్టిన వేల కోట్ల ప్రాజెక్టు దీనికి నిదర్శమని బీజేపీ మండిపడింది. వారు కట్టిన పాఠశాల నిర్మాణాలే ఈ విధంగా ఉంటాయని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ విమర్శించారు. ఆయన విమర్శలను ఆప్ తిప్పికొట్టింది. ఓ విద్యార్థికి గాయమైతే బీజేపీ మాత్రం రాజకీయ విమర్శలు చేసి ప్రయోజనం పొందాలని చూస్తుందని ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ విమర్శించారు.












Click it and Unblock the Notifications