ఎమ్మెల్యేలకు శశికళ చిక్కు, రిసార్ట్లో కళ్లు చెదిరే సౌకర్యాలున్నా...
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం దివంగత జయలలిత సమాధి సాక్షిగా చేసిన సంచలన ప్రకటన తమిళనాడు ప్రజలనే కాదు, యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.
చెన్నై: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం దివంగత జయలలిత సమాధి సాక్షిగా చేసిన సంచలన ప్రకటన తమిళనాడు ప్రజలనే కాదు, యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని అతిపెద్ద రాజకీయ సామ్రాజ్యంగా ఉన్న అన్నాడీఎంకే పన్నీర్ ఎదురు తిరగడంతో చీలిపోయింది.
అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఖరీదైన రిసార్టులలో ఉంటున్నారు. ఆ హోటళ్లలో కళ్లు చెదిరే సదుపాయాలు ఉన్నాయి. కానీ ఫోన్లు చేయకుండా మొబైల్ జామర్లు ఏర్పాటు చేశారు. టీవీ, పేపర్ బంద్ చేశారు. కనీసం కుటుంబ సబ్యులతో కూడా మాట్లాడనీయడం లేదని అంటున్నారు.
పన్నీరు ప్రకటన.. శశికళ అప్రమత్తం
ప్రజలు ఇష్టపడితే ముఖ్యమంత్రి పదవిని మళ్లీ చేపడతానని పన్నీర్ సెల్వం తన మనసులో మాట బయటపెట్టారు. తనతోపాటు పలువురు శాసనసభ సభ్యులు ఉన్నారని, శాసనసభలో బలం నిరూపించుకుంటానని చెప్పడంతో శశికళ అప్రమత్తమయ్యారు.
ఎమ్మెల్యేలు చేజారకుండా..
ఎమ్మెల్యేలు తన చేయి దాటిపోకుండా, పన్నీర్ సెల్వం చెంతకు చేరకుండా అపేందుకు అందర్నీ తన కట్టుబాటులో పెట్టుకొనే ప్రయత్నాలకు శశికళ దిగారు. అందరినీ బస్సులలో నగరానికి దూరంగా ఉన్న రిసార్టులలో ఉంచారు. ఈ చర్యతో శశికళ తీవ్ర విమర్శలు, కోర్టులో కేసులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఆ హోటల్స్పై దృష్టి
రాజకీయపోరులో అవి సహజం. వాటిని పక్కన పెడితే.. ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్పై అందరి దృష్టి పడింది. ఇంతకీ ఆ హోటళ్లు ఎక్కడ ఉన్నాయి, అందులోని విశేషాలేంటో తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే.
దీవిని తలపించేలా..
రెండు రోజుల క్రితం.. బుధవారం అన్నాడీఎంకే కార్యాలయంలో ఎమ్మెల్యేల సమావేశం ముగిసిన తర్వాత 120 మందికిపైగా ఎమ్మెల్యేలను రెండు లగ్జరీ బస్సుల్లో ఎక్కించి పంపించారు. మొదట విమానాశ్రయం సమీపంలోని స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేశారు. రాత్రికి వారి బస మహాబలిపురం సమీపంలోని కల్పాక్కం వద్ద ఉన్న గోల్డెన్ బే రిసార్ట్కి మారింది. ఈ రిసార్టు ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని కూవత్తూర్ ప్రాంతంలో ఉంది. చుట్టూ నీళ్లతో ఒక దీవిని తలపించేలా ఉంటుంది.
కళ్లు చెదిరే సౌకర్యాలు
అంతేకాదు, చల్లగా వీచే సముద్ర గాలి ఈ రిసార్ట్కి అదనపు ఆకర్షణ. సకల లగ్జరీ సదుపాయాలతో రోజుకి రూ.5,500, రూ.6600, రూ.9,900ల ధరతో మూడు విధాలైన రూంలు ఉన్నాయట. పార్టీ హాలు, డిన్నర్ హాలు సదుపాయాలున్నాయి. షికారు చేసేందుకు బోటింగ్, బోటులోనే డిన్నర్, సాహస క్రీడల్లో ఆసక్తి ఉన్నవారి కోసం ట్రెక్కింగ్, మోటార్ సైక్లింగ్ వంటి మరిన్ని వసతులున్నాయి. మసాజ్ సెంటర్, జిమ్ సరేసరి. దీంతో ఈ రిసార్టులో ధనవంతులు, విదేశీ పర్యాటకులు మాత్రమే బస చేస్తుంటారు.
కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనీయకుండా..
గోల్డెన్ బే రిసార్టులో ఎమ్మెల్యేలు అత్యంత సౌకర్యవంతంగా ఉండేందుకు సకల సదుపాయాలు ఉన్నాయి. అయితే వారిని బయట వ్యక్తులతో, కనీసం కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనివ్వకుండా చేశారన్నది వివాదాస్పదంగా మారింది. సెల్ఫోన్లు కూడా లాగేసుకున్నారని కొందరు ఎమ్మెల్యేలు వాపోతున్నారు. మరికొందరు రిసార్టులో బాగానే ఎంజాయ్ చేశారని చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉండగా, రిసార్టులలోని సెల్ ఫోన్ జామర్లను శుక్రవారం తొలగించారని తెలుస్తోంది.