బాహుబలి ఉత్సవాల ఎఫెక్ట్: ఒక్కపైసా ఇవ్వలేదు, మోడీ ఏం ముఖం పెట్టుకుని వస్తారు!
బెంగళూరు: కర్ణాటకలోని హాసన్ జిల్లా శ్రావణబెళగోళలో 12 ఏళ్లకు ఒక్కసారి ప్రతిష్టాత్మకంగా జరిగే బహుబలి మహామస్తకాభిషేకం ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు వస్తున్నారని, ఉత్సవాలకు ఒక్క పైసా నిధులు ఇవ్వని ఆయన ఏం ముఖం పెట్టుకుని రావడానికి సిద్దం అయ్యారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఇంకా ఖరారు కాకముందే ఇలాంటి ఆరోపణలు రావడంతో బీజేపీ అయోమయంలో పడిపోయింది.
12 ఏళ్లకు ఒక్కసారి
శ్రావణబెళగోళలోని గోమటేశ్వరుడు (బాహుబలి)కి 12 ఏళ్లకు ఒక్క సారి వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. జైనులు ఎంతగానో ఆరాధించే బాహుబలి ఉత్సవాలను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. బాహుబలి మహామస్తకాభిషేకంకు కేంద్రం ఏమాత్రం నిధులు మంజూరు చెయ్యలేదు.
ప్రధాని మోడీ హాజరు
ఫిబ్రవరి 19వ తేదీ సోమవారం మద్యాహ్నం 12.30 గంటకు ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో శ్రావణబెళగోళ వస్తారని హాసన్ జిల్లా అధికారులు అంటున్నారు. అయితే అధికారికంగా ప్రధాని మోడీ పర్యటన కేంద్ర ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు.
సంతోషం, ఎందుకు?
ప్రధాని నరేంద్ర మోడీ బాహుబలి ఉత్సవాలకు రావడం చాల సంతోషంగా ఉందని శ్రావణబెళగోళ మఠాధిపతి, మహామస్తకాభిషేకం స్వాగత కమిటీ అధ్యక్షుడు చారుకీర్తి భట్టారక అన్నారు. అయితే ప్రధాని మోడీ ఎందుకు వస్తున్నారు, ఆయనకు ఇక్కడ ఏం పని అని హాసన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
మాజీ ప్రధాని వేడుకున్నారు
భారత మాజీ ప్రధాని, హాసన్ జిల్లా ఎంపీ, జేడీఎస్ పార్టీ చీఫ్ హెచ్ డీ. దేవేగౌడ గత సంవత్సరం ఫిబ్రవరి, ఆగస్టు నెలల్లో రెండు సార్లు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసి మహామస్తకాభిషేకం ఉత్సవాలకు మొదట రూ. 500 కోట్లు ఇవ్వాలని మనవి చేశారని, చివరికి రూ. 100 కోట్లు మంజూరు చెయ్యాలని వేడుకున్నా కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా నిధులు ఇవ్వలేదని హాసన్ జిల్లా ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు.
కేంద్రం అనవాయితి
12 ఏళ్లకు ఒక్కసారి జరిగే బాహుబలి మహామస్తకాభిషేకం ఉత్సవాలకు గత కేంద్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేశాయని, అయితే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరించి నిధులు మంజూరు చెయ్యలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఏం మాట్లాడుతారు!
ఉత్సవాలకు నిధులు మంజూరు చెయ్యని ప్రధాని నరేంద్ర మోడీ బాహుబలి ఉత్సవాలకు హాజరై వేదిక మీద ఏం ముఖం పెట్టుకుని మాట్లాడుతారు? అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అయితే సీఎం సిద్దరామయ్య, మంత్రులు మాత్రం ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ మీద ఎలాంటి విమర్శలు చెయ్యకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రాష్ట్రపతి హాజరు
శ్రావణబెళగోళలో బాహుబలి మహామస్తకాభిషేకం ఉత్సవాలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సతీసమేతంగా హాజరై ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోడీ ముగింపు ఉత్సవాలకు హాజరుకావాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రధాని భద్రతా ఏర్పాట్లు చూసుకునే ఎస్ జీటీ అధికారులు శ్రావణబెళగోళ చేరుకుని పరిశీలించి హాసన్ జిల్లాధికారులతో చర్చించారు.
అయోమయంలో ప్రధాని
12 ఏళ్లకు ఒక్కసారి ప్రతిష్టాత్మకంగా, ఎంతో వైభవంగా నిర్వహించే బాహుబలి మహామస్తకాభిషేకం ఉత్సవాలకు నిదులు మంజూరు చెయ్యకుండా అక్కడికి వెళ్లడం మంచిదేనా ? అని ప్రధాని ఆలోచనలో పడ్డారని తెలిసింది. ప్రధాని మోడీ హాజరైతే నిరసన తప్పదని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించిన నేపథ్యంలో కర్ణాటక బీజేపీ నాయకులు ఇరకాటంలో పడ్డారు.